హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) మరో 10 రోజులపాటు పొడిగించింది. 2026 అక్టోబర్ ఒకటి అర్హత తేదీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ సర్ కార్యక్రమానికి సంబంధించి సవరించిన కొత్త షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమం గత షెడ్యూల్ ప్రకారం జూలై 24తో ముగియాల్సి ఉన్నది.
జాగా ఈ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. ఓటర్ల జాబితా ప్రచురణను అక్టోబర్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెంచారు. సర్ ప్రక్రియ తేదీ పొడిగించిన విషయాన్ని సవరణ షెడ్యూల్ వివరాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను సీఈవో ఆదేశించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ను కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని, అర్హులైన ప్రతి ఒకరూ సర్ ప్రక్రియలో పాల్గొనే అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్లు) పంపిణీ దాదాపు వంద శాతం పూర్తయినా వాటి డిజిటలైజేషన్ మాత్రం ఇంకా సగానికి కూడా రాలేదు. సీఈవో కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మొత్తం 3,38,26,448 ఓటర్లకుగాను 3,38, 21,554 (99.99%) మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. కానీ, అందులో 1,66,70,610 (49.28%) ఫారాలను మాత్రమే ఆన్లైన్లో డిజిటలైజ్ చేశారు.
ఓటర్ల సవరణ ప్రక్రియలో గ్రామీణ జిల్లాలు దూసుకెళ్తుండగా, పట్టణ జిల్లాలు వెనుకబడ్డాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన నగర జిల్లాలు డిజిటలైజేషన్లో అత్యంత వెనుకబడి ఉన్నాయి. మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో కేవలం 18.73 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. అత్యధికంగా 47.36 లక్షల ఓటర్లున్న హైదరాబాద్ జిల్లాలో 22.22 శాతం (10.52 లక్షలు), రంగారెడ్డి జిల్లాలో 33.43 శాతం నమోదు పూర్తయింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 24 వరకే అవకాశం ఉన్నందున పది రోజుల్లో సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తికాదని, అర్హుల ఓట్లు తొలగించకుండా ఉండాలంటే గడువు పెంచాలని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సీఈవోను కలిసి విజ్ఞప్తిచేశారు. ఏపీలో కూడా సర్ గడువు పదిరోజులు పొడిగించినందున ఇక్కడ కూడా పెంచే అవకాశం ఉన్నట్టు ‘నమస్తే తెలంగాణ’ అంచనా వేసింది. ఈ క్రమంలో సర్ గడువు పెంచాలని కోరుతూ సీఈవో ఈసీఐకి లేఖ రాశారు. భారత ఎన్నికల సంఘం మరో 10 రోజులపాటు పొడిగించేందుకు ఆమోదం తెలుపడంతో ఈ మేరకు సీఈవో సవరించిన షెడ్యూల్ను జారీచేశారు.
