Rythu Bandhu | రైతులకు గుడ్న్యూస్. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం ఖాతాల్లో చేరబోతున్నది. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రబీ సీజన్కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేకపోయింది. అయితే, ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరగా.. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
ఈ ఏడాది ఖరీఫ్కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్తో ఈ నిధుల విడుదల ఆగిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలుపడంతో.. నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించింది. కొత్తగా 1.5లక్షల మంది పోడు రైతులకు రైతుబంధు వర్తింప జేసింది. దాదాపు 1.54కోట్ల ఎకరాలకు రూ.7700కోట్లకుపైగా నిధులను రైతుల ఖాతాల్లో విడుదల వారీగా జమ చేసింది.