రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 9: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం చెన్నూర్లోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సోమవారం మంత్రి వివేక్ ప్రచారానికి వెళ్లారు. మంత్రి ప్రసంగిస్తూ కొత్త రేషన్ కార్డులు ఇచ్చామంటూ చెప్తుండగా అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలు ‘కాంగ్రెస్ గెలిస్తే రూ.4వేల పింఛన్ ఇస్తామన్నారు.. పింఛన్ ఎక్కడికి పోయింది.. ఇంకెప్పుడు ఇస్తారు.. అంటూ ప్రశ్నించింది. ఆమె మాటలకు మంత్రి చిరాకుపడుతూ ‘అరే అమ్మా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారమ్మా’ అంటూ మైక్లోనే తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమెకు సమాధానం చెప్పలేక మంత్రి చిరాకు పడటం, ఇటీవల మంత్రి ఎక్కడికి వెళ్లినా స్థానికుల నుంచి నిలదీతలు ఎదురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.