జగిత్యాల, మే 19 : పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన వృద్ధురాలు ముస్సె గంగవ్వ మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త చాలా ఏండ్ల క్రితమే చనిపోయారని, ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు జాగ తన కొడుకులు రాజలింగం, లింగం పేరిట జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నమోదై ఉందని పేర్కొంది. అదే స్థలంలో నిర్మించిన ఇంట్లో తాను నివసిస్తూ పంచాయతీకి ఏటా పన్ను చెల్లిస్తున్నానని తెలిపింది.
తనకు పింఛన్ ఇప్పిస్తామని నమ్మించి, తన పెద్ద కొడుకు రాజేశంతో కుమ్మకై అధికార పార్టీ సర్పంచ్ భర్త గట్టు గంగారాం 6 గుంటల ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించింది. రిజిస్ట్రేషన్ తర్వాత గంగారాం ఆ స్థలాన్ని గడ్డం మహేశ్కు, అతడు గణవేణి వెన్నెల (చిన్నాపూర్)కు విక్రయించినట్టు పేర్కొంది. ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకుందామని అనుకుంటే గణవేణి వెన్నెల, కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని వాపోయింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న గట్టు గంగారాం, గడ్డం మహేశ్, గణవేణి వెన్నెలపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇప్పించాలంటూ కలెక్టర్కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించింది.