మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో(Manchiryala) అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలను(Stray dogs) బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోవడంతో ఎనిమిది శునకాలు మరణించాయి. మరో 12 కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేసేందుకు మంచిర్యాలలో ప్రత్యేకంగా ఓ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. దవాఖానలో రోజూ 15 శునకాలకు శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం 20 శునకాలను సిబ్బంది హాస్పిటల్కు తరలించారు.
అయితే, సెప్టెంబరు, అక్టోబరు నెలల జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తమ యాజమాన్యాన్ని నిలదీయగా డాక్టర్ మినహా అందరినీ పది రోజుల క్రితం ఉద్యోగం నుంచి తీసేశారు. అప్పటి నుంచి సిబ్బంది ఎవరూ హాస్పిటల్కు రావడం లేదు. అప్పటికే దవాఖానలో ఉన్న శునకాలకు ఇదే శాపమైంది. ఆలనాపాలన చూసే వారు లేక, ఆకలితో అలమటించి ఎనిమిది కుక్కలు వారం క్రితం చనిపోయాయి. మరణించిన శునకాల కళేబరాలు తొలగించే వారు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వ్యాపించడంతో మూగ ప్రాణాల నరక యాతన బయటి ప్రపంచానికి తెలిసింది.