మోతె/సిద్దిపేట, ఫిబ్రవరి 28: సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మిరప కూళ్లకు వెళ్తున్న కూలీల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు, కారు బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురానికి చెందిన చెవుల నారాయణమ్మ (50), కందుల నాగమ్మ (50), కందుల గురవయ్య (50), రెమిడాల సౌభాగ్యమ్మ (60), రేపాలకు చెందిన పోకల అనసూర్య (50) మరికొందరు కూలీలతో కలిసి మోతె మండలం హుస్సేనాబాద్కు మిరప కూళ్లకు ఆటోలో బయల్దేరారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట కేశవాపురం అండర్పాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మధిర డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు కూలీల ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నారాయణమ్మ, నాగమ్మ, సౌభాగ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. వారిలో అనసూర్య మరణించింది. గురవయ్య పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. మరో కూలీ లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉండగా.. ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దుద్దెడకు చెందిన అనిల్.. కుటుంబంతో కలిసి కారులో హుస్నాబాద్లో వివాహానికి హాజరయ్యాడు. తిరుగు ప్రయాణంలో రాంపూర్ క్రాసింగ్ వద్దకు రాగానే కారు బైక్ను ఢీకొట్టగా బైకుపై వెళ్తున్న ఇద్దరితోపాటు కారులో ఉన్న కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల మమత అక్కడికకక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జనరల్ దవాఖానలో చికిత్స పొందుతూ నంగునూరు మండలం బద్దిపడగకు చెందిన కట్టె రవి, నాగరాజుపల్లికి చెందిన ఐలయ్య పరిస్థితి విషమించి చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు.