ఖమ్మం : వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది కూలీలపై పిడుగు పడిన సంఘటన జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన మద్ది వీరయ్య మిర్చి, పత్తిచేనులో కూలీలు చెత్తను తొలగిస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
కూలీలు వెంటనే పనులు ఆపి పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు చేరారు. ఇంతలోనే భారీ శబ్దంతో పిడుగు ఒక్కసారిగా పడడంతో ఎనిమిది మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా.. మిగతా వారికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.