జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా శాఖ రూపొందించిన 2023 వాల్ క్యాలెండర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్య బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఉపాధ్యాయ రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాదరావు, తపస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆయిల్నిని నరేందర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.