హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కోల్కతాలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్లు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున పాల్గొన్న లక్ష్మయ్య అక్కడి విశేషాలను మంత్రికి వివరించారు. కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్టు సీఈవో సుధాన్ రెడ్డి, చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.