హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనాతో అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థ గాడిన పడింది. గత రెండేండ్లుగా గందరగోళంగా తయారైన విద్యారంగానికి రాబోయే కొత్త విద్యా సంవత్సరంలో నవోదయం రానున్నది. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జేఈఈ, ఎంసెట్సహా పలు వృత్తివిద్యా కోర్సుల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. జాతీయంగా ప్రవేశాలు ఊపందుకొన్నాయి. జాతీయస్థాయి ఎంట్రెన్స్లతోపాటు పలు రాష్ర్టాలు వృత్తివిద్యాకోర్సుల షెడ్యూళ్లను ప్రకటించాయి. ముందస్తుగా షెడ్యూళ్లు విడుదల కావడంతో ఈ ఏడాది పరీక్షలు సమయానుగుణంగా జరుగుతాయని, ప్రవేశాలు సైతం సకాలంలోనే ముగుస్తాయని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
రెండేండ్లు ఆలస్యంగానే!
కరోనాకు ముందు ఏటా ఏప్రిల్, లేదా మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారు. కానీ కరోనాతో 2021, 2022 సంవత్సరాల్లో ప్రవేశ పరీక్షలు ఆలస్యంగా నిర్వహించడంతో ప్రవేశాల్లో జాప్యం జరిగింది. జేఈఈ మెయిన్ పరీక్షలు 2021లో ఫిబ్రవరి, మార్చి, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నాలుగు విడుతలుగా నిర్వహించారు. ఇవే పరీక్షలను 2022లో జూన్, జూలై మాసాల్లో నిర్వహించారు. ఇక తెలంగాణ ఎంసెట్ను 2021 ఏడాది ఆగస్టులో, 2022లో జూలైలో నిర్వహించారు. ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షలు ఆగస్టు వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. మొత్తం విద్యా సంవత్సరమే గందరగోళంగా మారింది. అయితే, ఈ ఏడాది ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడంతో ఇప్పటికే జేఈఈ మెయిన్ -1 ఎగ్జామ్స్ ముగియగా, ఫలితాలు సైతం విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ -2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రెండు నెలల ముందుకు జరుగడం విశేషం. ఈ ఏడాది ఎంసెట్ను మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో ఇబ్బందులు పడిన విద్యావ్యవస్థ గాడిన పడ్డట్టేనని విద్యారంగ నిపుణులు చెప్తున్నారు.
ఆగస్టులోపు ప్రవేశాలు పూర్తిచేస్తాం..
పరిస్థితులు కుదుటపడడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అన్ని రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ను ప్రకటించాం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తాం. సకాలంలో ఫలితాలు ప్రకటించి, ప్రవేశాలు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాం. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏలాంటి అన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలను త్వరగా పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. విద్యావ్యవస్థ గాడినపడటం శుభపరిణామం.
– ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్