హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి సబితారెడ్డి శనివారం బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాయనున్న 4,94,616 మంది విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆయా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షాకేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై త్వరలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలు, ఇతర అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.