హైదరాబాద్/కరీంనగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై బుధవారం ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గత రెండు రోజులుగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ స్థానికంగా లేకపోవడంతో అధికారులు మంత్రి గంగులకు వీడియోకాల్ చేశారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లవచ్చని మంత్రి చెప్పారు. దీంతో అధికారులు తాళం తీయించి ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్లే.. 2011లో కరీంనగర్ నుంచి రవాణా చేసిన గ్రానైట్ ఖనిజాన్ని కాకినాడ పోర్టులో మైనింగ్, విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. నిర్దేశించిన కొలతల్లో తేడాలున్నట్టు గమనించిన అధికారులు.. నిర్ధారణ కానటువంటి రూ.124 కోట్ల మెటీరియల్కు అపరాధ రుసుము కలిపి మొత్తం రూ.750 కోట్లు చెల్లించాలని 9 రవాణా ఏజెన్సీలకు నోటీసులిచ్చారు. కంపెనీలు న్యాయబద్ధంగా ఉన్న సొమ్మును చెల్లించి.. అపరాధ రుసుము పేరుతో వచ్చిన నోటీసులపై న్యాయస్థానాలను ఆశ్రయించాయి. బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 2019 జూలై 19న ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అదే నెలాఖరుకు మరోసారి ఫిర్యాదు చేశారు. నిరుడు జనవరి 11న బీజేపీ నాయకుడు పేరాల శేఖర్రావు మరోసారి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్లోనూ సోదాలు
ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై హైదరాబాద్కు చెందిన పలువురు గ్రానైట్ క్వారీ వ్యాపారుల కార్యాలయాలు, ఇండ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. రాజేంద్రనగర్ హైదర్గూడ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్, సోమాజిగూడలోనూ మరో గ్రానైట్ వ్యాపారి కార్యాలయాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగినట్టు తెలుస్తున్నది. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో ఈడీ అధికారుల సోదాలు కొనసాగినట్టు సమాచారం.
సల్లాపూరియా సత్వ గ్రూప్ ఆస్తులు జప్తు
మనీలాండరింగ్ ఆరోపణలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సల్లాపూరియా సత్వ గ్రూప్ ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం 316 బ్యాంకు ఖాతాల్లో రూ.49.99 కోట్లను బుధవారం జప్తు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా రూ.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. వాస్తవానికి హీరాగ్రూప్పై నమోదైన మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు పెద్ద మ్తొత్తంలో నగదు లావాదేవీలు హీరా గ్రూప్ నుంచి సల్లాపూరియా సత్వాగ్రూప్నకు వెళ్లినట్టు గుర్తించిన ఈడీ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
దర్యాప్తు సంస్థలకు సహకరిస్తాం: గంగుల
మునుగోడులో టీఆర్ఎస్ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తన వ్యాపారాలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు సంబంధించి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని, అందుకోసమే.. దుబాయ్కి వెళ్లిన 16 గంటల్లోనే వార్త తెలుసుకొని తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం దుబాయ్ నుంచి వచ్చిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై సంపూర్ణంగా దర్యాప్తు చేయాలని, నిజా నిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనని అన్నారు.
తన కుటుంబం 30 ఏండ్లుగా గ్రానైట్ వ్యాపారంలో ఉన్నదని, ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదని, నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు. తనపై, తన వ్యాపారంపై చాలా మంది, చాలాసార్లు ఐటీకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తన నిజాయితీ నిరూపించుకొనేందుకు దుబాయ్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఈడీ అధికారులకు వీడియో కాల్లోకి అందుబాటులోకి వచ్చి తాళం పగలగొట్టాలని చెప్పినట్టు తెలిపారు. ఇంట్లోని లాకర్లను కూడా తానే ఓపెన్ చేయించానని చెప్పారు. సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏం స్వాధీనం చేసుకున్నారో వారే చెప్పాలన్నారు. డబ్బు హవాలా, అక్రమ నిల్వలాంటి కార్యకలాపాలు తమ సంస్థలో జరగలేదన్నారు. రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివన్నారు.