దర్యాప్తు సంస్థలకు సహకరించి నేను విచారణకు హాజరవుతున్నాను. కానీ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, ఇతర నాయకులు తుషార్, జగ్గు స్వామి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? వారు తప్పు చేయకుంటే సిట్ విచారణకు ఎందుకు హాజరుకావడంలేదు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలకు ఎర కేసు నుంచి తప్పించుకోలేరు.
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేసులు పెట్టినా, పదే పదే నోటీసులు ఇచ్చినా, చివరికి అరెస్ట్ చేసినా తాను బీజేపీకి లొంగేదిలేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీ కుట్రలపై పోరాటంలో వెనక్కి తగ్గదేలేదని ప్రకటించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారుడినైనా తనపైనే అక్రమంగా కేసు నమోదు చేయాలని చూస్తున్నారని, అయినా ఎవరి ఒత్తిళ్లకూ తాను లొంగబోనని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ తీరు చూస్తుంటే, దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్టుగా ఉందన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ చూస్తున్నదని, తప్పుడు వివరాలు చెప్పించి, తనపై కేసు పెట్టాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. ఆర్థిక లావాదేవీలేమీ జరగని ఈ కేసుతో ఈడీకి ఏం సంబంధమని రోహిత్రెడ్డి ప్రశ్నించారు. తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. తనకు, నందకుమార్కు మధ్య ఎలాంటి లావాదేవీలూ లేవని ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 27న ఈడీ విచారణకు హాజరవుతానని తెలిపారు.
సైనికుడిలా ఎదుర్కొంటా..
సీఎం కేసీఆర్ సారథ్యంలో సైనికుడిలా బీజేపీ కుట్రలను ఎదుర్కొంటానని, ఈ కేసు విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని రోహిత్రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిందని, ఆ కుట్రను భగ్నం చేసినందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారుడినైన తననే దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకే ఈడీ నోటీసులు రావడం, విచారణ పేరుతో పిలువడంపై ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ఎంత భయపెట్టాలని చూసి నా, మానసికంగా ఒత్తిళ్లకు గురి చేసినా, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూసినా తాను లొంగబోనని స్పష్టంచేశారు. బీజేపీ కుట్రలను తిప్పుకొడుతానని అన్నారు.
బీజేపీ తన చేతుల్లోని ఈడీ, సీబీఐ, ఐటీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో సంబంధం లేకున్నా అభిషేక్ను విచారణకు పిలిచారని రోహిత్రెడ్డి విమర్శించారు. ఇది బీఆర్ఎస్ సమస్య కాదని, తెలంగాణ ప్రజల సమస్య అని చెప్పారు. తాను దర్యాప్తు సంస్థలకు సహకరించి విచారణకు హాజరవుతున్నానని, కానీ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, ఇతర నాయకులు తుషార్, జగ్గు స్వామి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారని రోహిత్రెడ్డి నిలదీశారు. వారు తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నించారు. అయినా కూడా ఈ కేసులో వారు తప్పించుకోలేరన్నారు. తాను కేసు విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.