హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తూ తనను అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హకులను ఘోరంగా హత్యచేసిందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడంపై ఆమె తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో 537 పేజీల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఈడీ తరఫున న్యాయవాది ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ ఓ సందర్భంలో.. కవితను అరెస్ట్ చేయబోమంటూ గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ను వెనక్కు తీసుకుంటామని అన్నారని కవిత న్యాయవాదులు గుర్తుచేశారు. దీనికి న్యాయస్థానం ఒప్పుకోలేదని, విచారణ ను ఈ నెల 19కి వాయిదా వేసిందని తెలిపా రు.
ఈడీ తరఫున అండర్టేకింగ్ను కోర్టులో దాఖలు చేసినప్పటి నుంచి ఈ నెల 15 వరకు కవితపై చర్యలు తీసుకునేందుకు కోర్టు ఎలాం టి అనుమతులు ఇవ్వలేదని గుర్తుచేశారు. అయినా ఈ నెల 15న కేసు వాయిదా పడిన వెంటనే ఈడీ నిజస్వరూపం బయటపడిందని, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి ప్రవేశించారని, తనిఖీల అనంతరం 5:20 గంటలకు అరె స్ట్ చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. సాయంత్రం 6:45 గంటల వరకు సూర్యాస్తమయం తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయని చెప్పారు. కవితను అరెస్ట్ చేయడం ద్వారా ఈడీ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుం డా, ఆమె ప్రాథమిక హక్కులను హత్యచేసినట్టు భావించాల్సి వస్తున్నదని అన్నారు.
సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా అరెస్ట్ చేయడం ద్వారా ఈడీ అధికారులు శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. పైగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సరైన కారణం కూడా చూపించలేకపోయారని అన్నారు. ఈడీ చెప్పిన కారణాలన్నీ నవంబర్ 2022 నాటివ ని, గత ఆగస్టులో ఇచ్చిన ప్రకటనతో ఎలాంటి సంబంధం లేనివనిని తెలిపారు. అసలు కవితపై ఎలాంటి కేసు లేదన్నారు. ఎవరో కొంతమంది వ్యక్తులు ఇచ్చిన ప్రకటనల ఆధారంగా మాత్రమే ఆమెను ఇందులో ఇరికించారని చెప్పారు. ఆ వ్యక్తుల నుంచి తీసుకున్న ప్రకటనలు బెదిరించి, బలవంతంగా తీసుకున్నవేనని, అరుణ్ రామచంద్ర పిైళ్లె తన ప్రకటనను వెనక్కి తీసుకోవడమే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు వ్యతిరేకంగా కొంతమంది చేసిన ప్రకటనలకు విశ్వసనీయత లేదని, వాటిపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈ నెల 15న రాత్రి 8:35 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానం టికెట్ను ముందుగానే బుక్ చేశారని న్యాయవాదులు గుర్తుచేశారు. తాము మరో విమానంలో టికెట్ కూడా బుక్ చేశామని ఈడీ అధికారులు మాట్లాడుకుంటుండగా కవిత విన్నారని తెలిపారు. కాబట్టి ఎయిర్లైన్స్ అధికారులను పిలిచి టికెట్లు ఎప్పుడు బుక్ చేశారో వివరాలు సేకరించాలని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, 15న కవితను అరెస్ట్ చేశారని, ఇది యాదృచ్ఛికం కాదని, కుట్రలో భాగమేనని అనుమానం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీచేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాల్సి ఉన్నప్పటికీ ఈ కేసులో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మనీలాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 19(1) ప్రకా రం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు చట్టబద్ధమైన నిబంధనలు పాటించడంతోపాటు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది, తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా అరెస్ట్ చేసిన వ్యక్తి నేరం గురించి చెప్పే కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని పేరొన్నారు. మనీలాండరింగ్ చట్టం, సెక్షన్ 19ని ఒక మహిళపై ప్రయోగించడం చట్టవిరుద్ధ్దంగా పరిగణించాలని విన్నవించారు. ఈనెల 15న తనని అరెస్ట్ చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు 16న ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ పూర్తి యాంత్రికంగా జరిగిందని, ఇలా అనుచితంగా రిమాండ్కి పం పడం ఆర్టికల్ 21, 22(1)(2) కింద హకులను హరించడమే అని స్పష్టం చేశారు.
కేంద్రంలోని అధికార పార్టీ నేతల రాజకీయ ఎజెండాలో భాగంగా ఈడీ పని చేస్తున్నదని, ఈడీ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందని బీజేపీకి చెందిన కొందరు నేతలు గతంలోనే పలుమా ర్లు చెప్పారని, ఇప్పుడు వారు చెప్పినట్టే జరగడం షాక్కు గురి చేస్తున్నదని చెప్పారు.