హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేదని తేల్చి చెప్పారు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి. ఆర్థిక వ్యవస్థ విషయంలో మోదీ అజ్ఞాని అని, నిర్మల నాలెడ్జ్ మైనస్ లెవల్లో ఉంటుందని కుండబద్దలు కొట్టారు. దేశానికి సరియైన నాయకత్వం లభిస్తే చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించగలమని, 25 ఏండ్లలో అమెరికాతో సమాన స్థాయికి రాగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. మోదీని గద్దె దించే శక్తి కాంగ్రెస్కు లేదని, ఆ పార్టీకి భవిష్యత్తే లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రజాస్వామిక లక్షణాలున్న కొత్త నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి ఆలోచనలు, వాటిని అమలు చేయగల ప్రణాళిక ఉన్నాయని తెలిపారు. ‘టీన్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన విషయాలు వెల్లడించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతున్నది. అందుకు ప్రధాన కారణాలు ఏమిటి?
దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నదని ఎప్పటి నుంచో చెప్తున్నా. కేంద్రానికి, ప్రభుత్వాలకు భయపడి అప్పట్లో నా వాదనలను మీడియా పట్టించుకోలేదు. కరోనా సమయంలో ఆర్థికవృద్ధి రేటు 3.5%. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ గాడిలో పడకపోగా, మునుపెన్నడూ లేని స్థాయికి పతనమవుతున్నది. అందుకు ప్రధాన కారణం దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవగాహన లేకపోవడమే. వారిద్దరూ ఆర్థికవేత్తల, విశ్లేషకుల సూచనలను పట్టించుకొనే స్థితిలో లేరు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రాబోయే ఐదేండ్లలో జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు తెస్తానని మోదీ చెప్తుండటం హాస్యాస్పదం. మోదీ ఓ అజ్ఞాని. ఆర్థిక వ్యవహారాలపై నిర్మలా సీతారామన్కు అవగాహన జీరో. ఇంకా చెప్పాలంటే ఆమెది మైనస్ లెవల్.
దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందా?
మోదీ పరిపాలన ఉన్నంతవరకు ఇండియన్ ఎకానమీ ఏ మాత్రం మెరుగుపడదు. వారికి అసలు సమస్య అర్థం కావడం లేదు. నేడు దేశంలో సమస్య సప్లయ్లో లేదు. డిమాండ్లోనే ఉన్నది. ప్రజలకు కొనుగోలుశక్తి లేకపోవడం. పడిపోవడం. ఉదాహరణకు వడ్డీరేట్లు, ఆదాయపు పన్నులు తగ్గిస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలన్నీ అందుకు భిన్నంగా ఉన్నాయి. వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. అమెరికాలో వడ్డీరేట్లు 2 శాతమే. ఇండియాలో 12%, 14%, 16 శాతంగా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 9 నుంచి 6 శాతానికి తగ్గించారు. అలా రెండు విధాలా ప్రజలను సేవింగ్స్కు దూరం చేశారు. ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలి. కనీసం పేదవాళ్లను, వ్యవసాయరంగాన్ని ఆ పరిధి నుంచి మినహాయిస్తే మనం ఏటా 10% వృద్ధిరేటును సాధించొచ్చు. కేంద్రంలో సరైన నాయకత్వం ఉంటే వచ్చే పదేండ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగవచ్చు. మరో 25 ఏండ్లలో అమెరికాతో కూడా సమంగా మారొచ్చు. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.100కు చేరే ప్రమాదస్థాయికి చేరుకొన్నాం.
బీజేపీ డబుల్ ఇంజిన్ గ్రోత్పై మీ అభిప్రాయం?
దానిని ఏవిధంగా, ఏ స్థాయిలో అమలు చేస్తారో కాస్త చెప్పమండి. కరోనా తరువాత కూడా ఇప్పటికీ 3% వృద్ధిరేటు లేదు. అయినా ఏడాదికి 14.8% చొప్పున ఐదేండ్లలో లక్ష్యాన్ని సాధిస్తామని మోదీ, కొందరు నేతలు చెప్తుంటారు. మోదీ ఆర్థిక విధానాలతో అది సాధ్యమేనా? ఈ అంశాలపై నాతో చర్చకు రమ్మంటే నిర్మత లాంటి వారు పారిపోతున్నారు.
75 ఏండ్ల స్వతంత్ర పాలనపై మీ ఆలోచనలు..?
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మినహా స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటివరకు కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వాలు రాలేదు. అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. పీవీ దేశాన్ని ప్రజాస్వామ్యబద్దంగా పాలించారు. వాజ్పేయి హయాంలోనూ వ్యక్తిగత వేధింపులు కొనసాగాయి. బ్యూరోక్రాట్లే ప్రభుత్వాన్ని నడిపేవాళ్లు. ఆ తరువాత కాంగ్రెస్ పాలన కూడా అంతే. తప్పుడు కేసులు బనాయించి సోనియాగాంధీ నాపై కక్షపూరితంగా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వమూ అదే చేస్తున్నది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమైంది? నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్పై ఉన్నారు. ప్రజాస్వామిక స్వభావం ఉన్న కొత్త నాయకత్వం దేశానికి అవసరం.
జాతీయ రాజకీయాలపై మీ కామెంట్?
జాతీయస్థాయిలో రాజకీయ శూన్యత ఉన్నది. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు. పాదయాత్రలతో ఫలితం దక్కదు. రాహుల్గాంధీ అసమర్థుడు. కాంగ్రెస్లో ప్రస్తుతం యోగ్యతలేని నాయకత్వం ఉన్నది. ఆ పార్టీ ప్రస్తుత అధినాయకత్వాన్ని ఈ దేశవాసులుగా ఎవరూ అంగీకరించడం లేదు. సొంతం చేసుకోవడం లేదు. బీజేపీ కూడా ప్రజాదరణను కోల్పోతున్నది.
బీఆర్ఎస్ ఏర్పాటుపై, కేసీఆర్ పాలనపై మీ మాట..?
కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడం శుభపరిణామం. కేసీఆర్ నాకు చాలాకాలంగా తెలుసు. జనతాపార్టీలో ఉన్నపుడు ఒకానొక సమయంలో మేం కలిసి పనిచేయాలని కూడా అనుకొన్నాం. కేసీఆర్కు మంచి ఆలోచనలు, వాటి అమలుకు కావాల్సిన ప్రణాళికలు ఉన్నాయి. గుజరాత్ మాడల్ విఫలం తరువాత జనాలు ఈ మాడళ్లను అంతగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇండియన్ మాడల్ కావాలి. ఒక మిత్రునిగా నేను ఎప్పుడూ కేసీఆర్కు మంచి జరగాలనే ఆకాంక్షిస్తా. బీజీపీ వాళ్లు నన్ను బయటకు పంపితే, మళ్లీ జనతాపార్టీని ఏర్పాటు చేస్తా. కేసీఆర్తో చేతులు కలుపుతా.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలన విధానాలు ఎలా ఉన్నాయి?
కేంద్రంలో ఏకవ్యక్తిస్వామ్యం నడుస్తున్నది. అది మితిమీరిపోతున్నది. మోదీ చెప్పినదానికి తలూపకపోతే వారి పరిస్థితి ఇక అంతే. నాలాంటి వాళ్లు ప్రశ్నిస్తే బయటకు పంపేస్తారు. మంత్రులుగా సమర్థంగా పని చేసిన నితిన్గడరీ, హర్షవర్థన్ అందుకు ఉదాహరణ. వారిలానే అందరికీ ఉద్వాసన పలికారు. పీఎంవోలోని బ్యూరోక్రాట్లు ఏది చెప్తే అది చేస్తున్నారు. కేంద్ర మంత్రులు రబ్బర్స్టాంపుల్లా మారారు. మోదీ, అమిత్షాను గద్దె దించకపోతే బీజేపీ కుప్పకూలుతుంది. వాళ్లు కొనసాగితే ఇక పార్టీ ఎన్నికలు జరగవు. జాతీయ కార్యవర్గం రబ్బర్స్టాంపులా మారిపోతుంది.