హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు? ఎన్నికల కమిషన్ ఏమి ఆలోచిస్తున్నది? ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాల ఉపఎన్నికలకు ఇప్పుడప్పుడే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నదా? దీనిపై రాజకీయవర్గాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అదిగో.. ఇదిగో అంటూ సోషల్ మీడియాలో రోజుకో తేదీ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నెల 9న దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. ‘ఎన్నికల సమయంలో పాటించాల్సిన కొవిడ్ నియమాల గురించి మేం (ఈసీ) సవివరంగా పేర్కొన్నాం. ఇవి మా వెబ్సైట్లోకూడా ఉన్నాయి. 2021-22లో ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు, పలు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉన్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలు.. మీ సూచనలు సలహాల కోసం విజ్ఞప్తి’ అంటూ రాసిన ఈ లేఖలో ‘ దేశంలో కరోనా మహమ్మారి నెలకొన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల ప్రచారం చేయాల్సిన తీరుకు సంబంధించి మేం (ఎన్నికల సంఘం) ఇప్పటికే పలు ఆదేశాలు, మార్గదర్శకాలు, సూచనలు జారీచేశాం. అయితే 2021-22లో దేశంలోని ఐదు రాష్ర్టాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్) అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అలాగే
పలు రాష్ర్టాల్లో ఉపఎన్నికలు కూడా జరపాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో కమిషన్ గతంలో పేర్కొన్న మార్గదర్శకాలు, సూచనలు, ఆదేశాలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ఆగస్ట్ 30లోగా పంపించాలి. మీరిచ్చే సూచనల ఆధారంగా మరిన్ని సవివరమైన మార్గదర్శకాలను మేం తయారుచేస్తాం’ అని ఎన్నికల కమిషన్ కార్యదర్శి అరుణ్కుమార్ పేరుతో ఈ లేఖ విడుదలయింది.
ఈ నెలాఖరుదాకా లేనట్టే..!
ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే పార్టీలు తమ సూచనలను తెలియజేయడానికి ఆగస్ట్ 30 వరకు గడువు ఇచ్చిందంటే ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఆగస్ట్ 30 తర్వాత కూడా వెనువెంటనే నోటిఫికేషన్ వస్తుందా? అనేది అనుమానమే అంటున్నారు. పార్టీలన్నీ 30లోగా తమ అభిప్రాయాలు పంపకపోవచ్చని, మరింత సమయం కోరే అవకాశం ఉన్నదని కూడా చెప్తున్నారు. ఒకవేళ అన్ని పార్టీలు గడువులోపే పంపుతాయని అనుకున్నా అభిప్రాయాలన్నింటినీ ఎన్నికల సంఘం క్రోడీకరించడానికి, అవసరమైన మార్పులు, చేర్పులు చేసి సవివరమైన మార్గదర్శకాలు రూపొందించడానికి సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకైనా, ఉప ఎన్నికలకైనా నోటిఫికేషన్ సెప్టెంబర్, అక్టోబర్, లేదా నవంబర్లో ఎప్పుడు వెలువడుతుందనేది ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నారని అంటున్నారు. సెప్టెంబరు నెలాఖరుదాకా హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ కూడా ప్రకటించేలా కనిపించడంలేదు.
సుప్రీం తీర్పు ప్రకారమే నిర్ణయం
సెప్టెంబర్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందా అంటే .. అనుమానమేనని విశ్లేషకులు చెప్తున్నారు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడంపై గతంలో మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీని నరహంతకులతో సమానమన్నట్టు వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం కొంతనొచ్చుకోవడంతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తీర్పు సుప్రీంకోర్టులో రిజర్వ్లో ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్నికల కమిషన్ ఎన్నికలను సత్వరమే నిర్వహించాలని అనుకున్నా అందుకు సుప్రీంకోర్టు ఆమోదం తీసుకోక తప్పదేమో అన్న అభిప్రాయం కూడా ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సుప్రీంకోర్టు చెప్పేదాన్ని పరిగణనలోకి తీసుకోకతప్పదు. ఇక సెప్టెంబరో.. అక్టోబరులోనో షెడ్యూల్ వస్తుందనుకుంటే మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగించేలా ఉన్నది. భారత్కు థర్డ్వేవ్ ముప్పు ఉన్నదని చెప్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నది.