హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుకార్డుల ముద్రణను చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్తగా ఓటుహక్కు పొందిన, చిరునామా మార్చుకున్న దాదాపు 15 లక్షల మందికి కొత్తగా ఓటరుకార్డు ఇవ్వనున్నారు. ఓటరుకార్డుల పంపిణీ కోసం పోస్టల్శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దశాబ్దం క్రితం జారీ చేసిన ఓటరుకార్డు స్థానం లో కొత్త కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదనకు సైతం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తే మరో 40 లక్షలకార్డులను ముద్రించాల్సి ఉంటుంది. అయితే, దేశవ్యాప్తంగా ఓటరుకార్డు ముద్రణ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉండటంతో దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన ఈవీఎంల కంటే అదనంగానే సిద్ధంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 73,500 బ్యాలెట్ యూనిట్లు, 46,434 కంట్రోల్ యూనిట్లు, 54,451 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవతవతకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో 24 నియోజకవర్గాల్లోని ఈవీఎంలను పార్లమెంట్ ఎన్నికలకు వినియోగించడంలేదు. వీటి స్థానంలో రాష్ట్రంలో అదనంగా అందుబాటులో ఉన్న ఈవీఎంలను వినియోగంలోకి తెచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను పరిశీలించి, వాటిలో ఎలాంటి డాటా, ఓట్లు లేవని నిర్దారిస్తున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకానున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలంటే ఓటర్లలో కనీసం 75% ఓటర్లు ఉండాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. జూన్ మొదటి వారంలో ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్నది. దీంతో సాధ్యమైనంత తొందరగా ఉప ఎన్నిక నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.