ఇల్లందకుంట, ఆగస్టు 30: ‘నా భర్త మల్లయ్య క్యాన్సర్తో చనిపోయిండు.. సీఎం సహాయనిధి మంజూరు కోసం ఆయన దగ్గరకు పోతే ఎళ్లగొట్టిండు. ఆ రోజు ఆయన సాయం చేసి ఉంటే నా భర్త బతికెటోడు’ అని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన చిలువేరు ఆగమ్మ వాపోయింది. ‘నా భర్త మల్లయ్యకు క్యాన్సర్ వస్తే.. ఆపరేషన్ కోసం రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పిండ్రు. సర్పంచ్ వెంకటస్వామితో కలిసి ఈటల రాజేందర్ దగ్గరికి పోయిన. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2 లక్షలు కావాలని అడిగిన. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకుండా అక్కడి నుంచి ఎళ్లగొట్టిండు. పుస్తెళ తాడు, కమ్మలు అమ్ముకొని ఆపరేషన్ చేయించినా తన భర్త బతకలేదని ఆవేదన వ్యక్తం చేసింది.