హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిని ముందే గ్రహించిన బీజేపీ నేత ఈటల రాజేందర్, ఆ నెపాన్ని అధికారులపై నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సహా పలువురిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. దళితబంధుపైనా అసత్య ఆరోపణలు చేస్తూ తమ నైజాన్ని బయటపెట్టుకున్నారు. మంత్రి హరీశ్రావుకు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి ఈ నెల 7న ఎన్నికల సంఘానికి లేఖ రాయడం బీజేపీ, ఈటల ఓటమి భయాన్ని బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అధికారులపై అడ్డగోలు ఫిర్యాదులా?
ఈటల రాజేందర్ రాజీనామా చేయగానే ఉద్దేశపూర్వకంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ, హుజూరాబాద్ ఆర్డీవోను మార్చారని ఈసీకి రాసిన లేఖలో బీజేపీ ఆరోపించింది. కొత్త అధికారులు మంత్రి హరీశ్రావుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఇతర పార్టీల అభ్యర్థులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అధికారుల బదిలీలు సర్వ సాధారణం. ఎన్నికల వేళ అధికారులపై ఈసీ నిఘా కూడా ఉంటుంది. అసాధారణ నియామకాలు జరిగినట్టు గుర్తించినా, నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలినా వెంటనే చర్యలు తీసుకొంటుంది. దళితబంధును సమర్థంగా అమలుచేసేందుకు ఐఏఎస్ అధికారి ఆర్వీ కర్ణన్ను ఏరికోరి కరీంనగర్ జిల్లాకు తీసుకొచ్చినట్టు కేసీఆర్ చెప్పారు.
దళితబంధుపై తెలివిలేని వ్యాఖ్యలు
దళితబంధు నిధులపైనా బీజేపీ అసత్యప్రచారం చేసింది. లబ్ధిదారులకు డబ్బు చేరకుండా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా ఆపారని, పోలింగ్ తేదీకి మూడునాలుగు రోజుల ముందు ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళితబంధు ఎప్పుడో అమలైంది. ప్రభుత్వం మొత్తం 20,969 మంది లబ్ధిదారులను గుర్తించి, 16,969 మంది ఖాతాల్లో ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున జమచేసింది. పోలీసులపైనా బీజేపీ తన అక్కసును వెల్లగక్కుతున్నది. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఆహారం సరఫరా చేస్తున్నారంటూ దిగజారుడు ప్రచారం చేస్తున్నది. వాస్తవానికి డబ్బులు, మద్యం పంచుతున్నది బీజేపీ నేతలనేనని స్థానికులు అంటున్నారు. బొట్టు బిళ్లలు, గోడగడియారాలు పంచితే ప్రజలు వాటిని నడిరోడ్డుమీద పగులగొట్టారు. ఓ పార్టీ నేతకు చెందిన చానల్ వాహనాల్లో డబ్బులు రవాణా చేస్తూ దొరికిన విషయాలను ఉదహరిస్తున్నారు.
సవాల్ అంటివి.. ఫ్రస్ట్రేషన్ ఎందుకు?
హుజూరాబాద్లో గెలుపు తనదేనంటూ ఈటల మొదటి నుంచీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మంత్రి హరీశ్రావుకు పలుమార్లు సవాల్ కూడా విసిరారు. ఇప్పుడు ఆయనలో ఫ్రస్ట్రేషన్ పెరిగి హరీశ్రావుపై అడ్డుగోలు ఆరోపణలు చేస్తున్నారు.