హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ను అమలుచేయాలని యోచిస్తున్నది. పారిశ్రామికవేత్తలు, విషయ నిపుణులను ప్రొఫెసర్లుగా నియమించనున్నది. ఇప్పటికే ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం జరిగే వర్సిటీ ఎగ్జిట్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ఈసీ పచ్చజెండా ఊపితే ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోనున్నారు.
వర్సిటీలోని అన్ని రకాలైన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, ఇంజినీరింగ్, ఎంబీఏ, లా వంటి కోర్సుల్లో 12 రకాల ఫ్యాకల్టీ విభాగాల్లో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వాడుకుంటారు. రాష్ట్రంలోనే తొలి వర్సిటీగా ఇటీవలే జేఎన్టీయూ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అమలుకు నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుపరుస్తున్నది. అదే బాటలో ఓయూ సైతం చర్యలు చేపట్టింది.
15 ఏండ్ల అనుభమున్నవారినే..
రెగ్యులర్ ప్రొఫెసర్ల స్థానంలో వివిధ రంగాలకు చెందిన విషయ నిపుణులు వర్సిటీల్లోని విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకుగాను ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. వీరిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా పేర్కొన్న యూజీసీ, పీహెచ్డీ అర్హతలతో నిమిత్తం లేకుండానే వీరిని ప్రొఫెసర్లుగా నియమించుకునే అవకాశానిచ్చింది. కోర్సులను బట్టి.. సంబంధిత పరిశ్రమకు చెందిన విషయ నిపుణులను ప్రొఫెసర్లుగా నియమించుకునే వెసులుబాటును కల్పించింది. మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకుండా, ఆయా రంగాల్లో 15 ఏండ్ల అనుభవమున్న వారిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా నియమించుకోవచ్చని యూజీసీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే ఓయూ అధికారులు వీరి సేవలను వినియోగించుకోవడంపై కసరత్తును ముమ్మరం చేశారు. ఇటీవల వర్సిటీలో పెద్ద ఎత్తున కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. గతంలో ఈ కోర్సులను చదివిన వారు లేకపోవడంతో అధ్యాపకుల కొరత సమస్య వేధిస్తున్నది. విద్యాబోధనను ముందుకు సాగించడం, పారిశ్రామిక వర్గాలతో అనుసంధానించడంలో భాగంగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోవాలని ఓయూ నిర్ణయానికి వచ్చింది.