హైదరాబాద్ : ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం స్వల్ప భూకంపం సంభవించింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాలు, పెద్దపల్లి రామగుండం కార్పోరేషన్, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. సాయంత్రం 6.49 గంటల సమయంలో నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది.
దీంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగిరి, ముత్తారం మండలాలు, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోనూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని కొన్ని వార్డులతో పాటు పోరండ్ల, కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట, కోరుట్ల పట్టణం, మెట్పల్లి చైతన్య నగర్, బీర్పూర్, మల్యాల మండల కేంద్రం.. లంబాడిపల్లి గ్రామాల్లో భూమి కంపించింది.
భూ ప్రకంపనలతో ఇండ్లలోని వస్తువులు పడిపోవడంతో జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సాయంత్రం 6.48 గంటల సమయంలో భూకంపం సభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఈ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. నిజామాబాద్కు 199 కిలోమీటర్ల దూరంలో, భూమికి 77 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నది.