హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణ పేద విద్యార్థులకు వరంలా మారింది. 201617 నుంచి ఈ శిక్షణ అమలవుతూ మంచి సత్ఫలితాలిస్తున్నది. విద్యార్థులకు ఫీజుల భారం నుంచి విముక్తి కల్పిస్తున్నది. గతంలో ఎంసెట్, నీట్ కోచింగ్లకు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో చేరి, వేలకు వేలు ఫీజును ధారపోయాల్సి వచ్చేది. కానీ, పేద విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 202122 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కాలేజీల్లో 3,300 మంది విద్యార్థులు ఎంసెట్, నీట్ శిక్షణ పొందారు. వీరిలో 1,755 మంది ఇంజినీరింగ్లో, 18 మంది విద్యార్థులు నీట్లో సీట్లు దక్కించుకొన్నారు. 2019 -20లో అత్యధికంగా 2,500కు పైగా విద్యార్థులు సీట్లు కైవసం చేసుకోవడం గమనార్హం. ఇదివరకు కాలేజీల్లో నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది 33 జిల్లాల్లో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాక్టికల్స్ పూర్తికాగానే, రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ టెస్టు ద్వారా మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంటెన్సివ్ సమ్మర్ కోచింగ్..
స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఏప్రిల్, మే మాసాల్లో పూర్తి ఉచితంగా ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్ ఇస్తారు. స్థానిక జిల్లాల్లోని గురుకులాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలకు ముందు రెగ్యులర్ సిలబస్తో సమాంతరంగా ఎంసెట్ శిక్షణ కాలేజీల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన తర్వాత రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ నిర్వహిస్తారు. జిల్లాకు 100 మంది విద్యార్థుల చొప్పున 3,300 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఒక్కో జిల్లాలో 50 మంది చొప్పున అమ్మాయిలు, అబ్బాయిలుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటారు. ఇటీవలే ఎంసెట్ షెడ్యూల్ విడుదల కావడంతో శిక్షణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందించాలని ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులు భావిస్తున్నారు.