Telangana | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : మొన్నటి వానకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కళకళలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. ఎంత పంట వేసినా నీళ్లు పారుతాయనే ధీమా నుంచి… వేసిన పంటైనా పారుతుందో లేదో అనే దుర్భర పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ ఎవుసం.. కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే గాడి తప్పుతున్నది.
మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. మునపటి రోజులు కండ్ల ముందు కదులుతున్నాయి. ఎండిన పంటలు, అడుగంటిన బోర్లు, బావులు, కరెంట్ కష్టాలు, పంటలకు మద్దతు ధర ఇక్కట్లు ఇలా కొన్నేండ్లుగా రైతులకు దూరంగా ఉన్న సమస్యలన్నీ మళ్లీ ఒక్కసారే ముప్పేట దాడి చేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పెట్టుబడి భారమై రైతులు అప్పులపాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నీళ్లు లేక ఎండుతున్న పంటలు…
మొన్నటి వరకు పుట్ల కొద్ది వడ్లు పండిన రాష్ట్రంలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 51 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నల్గొండలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్లో 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పగ, సాగునీళ్ల నిర్వహణలో అలసత్వం వ్యవసాయరంగాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తున్నది.
సాగునీళ్లు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. 51 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సగం పంట సాగునీళ్లు లేక ఎండిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. గతేడాది ఈ సమయానికి సుమారు 74 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ప్రస్తుతం ఇది 66 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే గత యాసంగితో పోల్చితే 8 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గడం గమనార్హం. ఇందులో వరి సాగే ఏకంగా 6.25 లక్షల ఎకరాల్లో తగ్గడం గమనార్హం.
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ తెచ్చిన కరువుఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పశువులను వదిలేస్తే.. మరికొన్ని చోట్ల ఎండిన వరి పైరుకు నిప్పు పెడుతున్నారు. కొన్ని చోట్ల పొట్టకు వచ్చిన వరి పైరుకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు.
రైతుల ధర్నాలు.. మళ్లీ మొదలు
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీళ్లు, కరెంట్, ఎరువులు, మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కడం సర్వసాధారణంగా ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాడిలో పెట్టి రైతుల కష్టాలు తీర్చింది. కానీ పదేండ్ల తర్వాత మళ్లీ మునపటి రోజులు కండ్ల ముందు కదులుతున్నాయి. సాగు నీళ్ల కోసం, కరెంట్ కోసం, ఎరువుల కోసం, మద్దతు ధర కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కుతున్నారు.
ఓ వైపు యాసంగి సీజన్ పూర్తవుతున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పూర్తిగా అందలేదు. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన యాసంగి పెట్టుబడి సాయం మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడెకరాల రైతులకే పెట్టుబడి సాయం జమ చేసినట్లు తెలిసింది. ఇంకా మిగిలిన వారికి ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
పదో తారీఖొచ్చినా పత్తాలేని సాగునీళ్లు
హామీ ఇచ్చి ముఖం చాటేసిన అధికారులు
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టులోని రైతులు సాగు నీళ్ల కోసం తండ్లాడుతున్నారు. కండ్ల ముందే ఎండుతున్న పంటలను చూడలేక రైతులు ఈ నెల 6న మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో దిగివచ్చిన మంథని ఆర్డీవో హనుమానాయక్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఈ నెల 9 వరకు అన్ని గ్రామాలకు సాగు నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.అయితే పదో తారీఖు వచ్చినా సాగు నీళ్లు పత్తా లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు పోద్దో గీ పీడ
లోవోల్టేజీతో విద్యుత్ మోటర్లు కాలిపోతున్నై. ఒక్కో మోటర్కు అల్లిస్తే రూ. 3 వేల నుంచి రూ. 5 వేలు ఖర్చు అయితాంది. రెండు నెలల నుంచి రాత్రి బగర్ టైమ్లో త్రీఫేస్ ఇత్తాండ్లు. పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నై. కేసీఆర్ ఉంటే గీ గోస ఉండేది కాదు. ఆయనే కరెంట్, రైతు బందు, అదునుకు పిండి బత్తాలు, ఇత్తనాలు ఇస్తుండే. పదేండ్లుగా ఏనాడూ పంటలు ఎండిపోలే. గిప్పుడు మల్లా కాంగ్రెసోళ్లు దాపురించాక గోస పడుతున్నం. ఎప్పుడు పోద్దో గీ పీడ.
– ఎలబోయిన కట్టయ్య,దస్తగిరిపల్లె
ముళ్లపొదలతో కాల్వలు
రామతీర్థం గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ డీబీఎం 38 ఉపకాల్వ ముళ్లపొదలతో పూర్తిగా కూరుకుపోయింది. ఈ కెనాల్ నీటిపై ఆధారపడి చాలా మంది రైతులు ఆరుతడి పంటలు సాగు చేశారు. సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
–నల్లబెల్లి
పెట్టుబడి కూడా లాసే..
మాది మంథని మండలం సిద్ధపల్లి గ్రామం. నాకు పుట్టపాక గ్రామ శివారుల మూడెకరాలు ఉంది. ఇంకో ఐదెకురాలు బటాయి(కౌలు)కి తీసుకొని దున్నుతున్న. పదేండ్ల నుంచి ఎన్నడూ నా పంట ఎండలేదు. ఈ సారే ఇట్లయ్యింది. ఈ పంటకు గతేడాది వారానికోసారి పుష్కలంగా నీళ్లచ్చేది. ఈ ఏడు ఒకే ఒక్కసారి నీళ్లచ్చినై. ఆ నీళ్లు కూడా పంట తడిసే అన్ని రాలే. దీంతోటి నా పొలం మీద ఆశలన్నీ పోయినై. ఎకరానికి రూ.35 వేల పెట్టుబడి పెట్టా..మొత్తం లాసే.
-సిద్ద సదయ్య, సిద్దపల్లి, మంథని
అన్యాయమై పోయినం..
మాది మంథని మండలం పుట్టపాక గ్రామం. నాకు మూడెకురాల పొలం ఉన్నది. ఎస్సారెస్పీ నీళ్లు రాక ఈసారి చానా అన్యాయమై పోయి నం. ఈ పంట పోయినట్టే. అందుకే గొర్ల మేపుతున్నం. మమ్ముల ప్రభుత్వమే ఆదుకోవాలె.
-కొమ్ము సారయ్య, పుట్టపాక, మంథని,పెద్దపల్లి జిల్లా