రాష్ట్రంలో కులగణన నిర్వహించి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈ మేరకు ప్రకటించింది. రాష్ట్రంలో త్వరలోనే కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ప్రకటించారు.
బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖలతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. కులగణన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతవరకు బాగానే ఉన్నా కులగణన ఎలా నిర్వహిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు న్యాయపరమైన చిక్కులు, మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అందుకు అడ్డంకిగా నిలిచే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): జనాభా గణన చట్టం-1948 ప్రకారం జనాభా గణన, కులగణన చేపట్టే అధికారం కేంద్రప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. వాటిని అమలు చేసే అవకాశం కూడా లేదు. ఇటీవల బీహార్ రాష్ట్ర సర్కారు నిర్వహించిన కులగణన కోర్టుకెక్కింది. బీహార్ ప్రభుత్వం కులగణన నిర్వహించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే ఆ రిజర్వేషన్లు 75 శాతానికి పెరిగాయి. ఇది సుప్రీంకోర్టు గతంలో విధించిన 50 శాతం కోటా పరిమితిని మించిపోయింది. మరోవైపు బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణననే చెల్లుబాటు కాదని, ఆ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవని అనేకమంది పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్ల అమలు పెండింగ్లో ఉన్నది. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ర్టానికి జనాభా గణన నిర్వహించే అధికారం లేనందున ఆ సర్వే వివరాలను నాటి ప్రభుత్వం వెల్లడించలేదు. అమలు కూడా చేయలేదు. మరిప్పుడు కాంగ్రెస్ సర్కారు ఏ రీతిన కులగణన చేపడుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం నామమాత్రంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. గతంలో లాటరీ పద్ధతిలో, ర్యాండమ్గా ఎంపిక చేసే తదితర అశాస్త్రీయమైన పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించారు. దీంతో ప్రతిసారీ బీసీ రిజర్వేషన్లపై న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్రావు గవాళి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ట్రిపుల్ టీ పేరిట పలు మార్గదర్శకాలు జారీచేసింది. అందులో మొదటిది ప్రతి స్థానిక సంస్థలో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. రెండవది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడవది రిజర్వేషన్లు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తంగా 50 శాతం మేరకు మించకూడదు. వాటినే ట్రిపుల్ టీ అంటారు. ఆ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలోనూ లోకల్బాడీ ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నిబంధనలను పాటించని పలు రాష్ర్టాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సిఫారసులు లేకుంటే బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటినీ జనరల్ స్థానాలుగానే మార్చే అవకాశముంది. సూటిగా చెప్పాలంటే కమిషన్ల నివేదిక లేకుండా స్థానికసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఇకపై ఉండబోవనేది ఈ తీర్పు సారాంశం.
కమిషన్తోనా? ప్రణాళికశాఖ ద్వారానా?
బీహార్ తరహాలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో కుల గణన నిర్వహిస్తారా? లేదంటే కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ర్టాల తరహాలో నిర్వహిస్తారా? అనే అంశంపై బీసీ నేతల్లో చర్చ మొదలైంది. ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే బీహార్ తరహాలోనే న్యాయ చిక్కులు తప్పకపోవచ్చని తెలుస్తున్నది. అలా కాకుండా బీసీ కమిషన్ నేతృత్వంలోనే చేపట్టాలంటే తాజాగా ప్రభుత్వం మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉన్నది. కమిషన్ కాలపరిమితి ఆగస్టు వరకు మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ పనిచేస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి దానిని రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. దీంతో గత ప్రభుత్వం నియమించిన ప్రస్తుత చైర్మన్, సభ్యులతో స్వచ్చందంగా రాజీనామా చేయించాలని చూస్తున్నట్టు సమాచారం. అందుకు వారు అంగీకరిస్తారా? అనేది మరో ప్రశ్న. కొత్త కమిషన్ను ఏర్పాటు చేసినా రాబోయే కొద్ది రోజుల్లోనే లోకసభ ఎన్నికల రానున్నాయి. దీంతో అన్ని ప్రభుత్వశాఖలు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి. దీంతో కుల సర్వే నిర్వహించడం అసాధ్యమనే చెప్పాలి. వెరసి లోక్సభ ఎన్నికల తరువాతే కుల సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే సర్వే నిర్వహించి, గణాంకాలు వెలికితీసి, నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందడానికి మరింత జాప్యమవుతుంది. అప్పటివరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఉండబోదు. ఒకవేళ నిర్వహిస్త్తే ఎస్సీ, ఎస్టీలకు తప్ప ఎవరికీ రిజర్వేషన్లు అనేవే ఉండవు.
ఇప్పటికే తుదిదశకు నివేదిక..
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలో పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ణయానికి సంబంధించి ఎంచుకోవాల్సిన విధానం, న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు కమిషన్కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను కూడా నిర్దేశించింది. ఆ దిశగా కమిషన్ అధ్యయనం చేపట్టింది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పర్యటించింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించింది. ఆయా రాష్ర్టాల్లో బీసీ రిజర్వేషన్లు, బీసీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, జనగణనలో ఎదురైన సవాళ్లు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై అక్కడి బీసీ కమిషన్లతో సమాలోచనలు జరిపింది. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో (స్థానిక సంస్థలు) బీసీల ప్రాతినిధ్యం, పొందిన అవకాశాలకు సంబంధించి గణాంకాలను అందజేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. ఇప్పటికే అందుకు సంబంధించి నిర్దిష్టంగా సమాచారాన్ని సేకరించింది. తుదినివేదికను సిద్ధం చేస్తున్నది.