ఆదిలాబాద్/జడ్చర్లటౌన్/తాండూర్/బెజ్జూర్: రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన దందా ఆగడం లేదు. రాష్ట్ర సరిహద్దులను దాటి టన్నులకొద్దీ నకిలీ విత్తనాలు మార్కెట్లలో అమ్మకానికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైఫల్యం, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా నకిలీల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. శుక్రవారం మధ్యాహ్నం రాంనగర్ ప్రాంతంలో గోదాములో నకిలీ విత్తనాలు తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు సామ అశోక్ రెడ్డితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ గౌస్ ఆలంతోపాటు వ్యవసాయశాఖ, పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్ బృందం విత్తన తయారీ కేంద్రపై దాడి చేశారు.
వివిధ కంపెనీలకు చెందిన 945 పత్తి విత్తన ప్యాకెట్లతో పాటు 50 కిలోల విడి పత్తి విత్తనాలు, 330 బ్యాగులు జొన్న విత్తనాలు, నకిలీ విత్తనాల తయారీకి ఉపయోగించే కలర్, కెమికల్ను పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.19,39,908 ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు నిల్వ చేసినట్టు సమాచారం రావడంతో వ్యవసాయాధికారులు, పోలీసులు గురువారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నట్టు ఏఎస్పీ రాములు శుక్రవారం వెల్లడించారు. విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లిలో పోలీసులు, వ్యవసాయాధికారులు శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. కొత్తపల్లికి చెందిన ఎర్రవోతు రాజు ఇంటిలో రూ.50 వేల విలువైన 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డట్టు టాస్క్ఫోర్స్ ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమిని గ్రామానికి చెందిన తొర్రెం ప్రశాంత్ వద్ద 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు.