CM Revanth Reddy | హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్నగర్లో ఒకే డంప్ యార్డు ఉన్నారు. ప్రతిరోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతున్నది.
డంప్యార్డ్తో వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. చెత్త ద్వారా 15మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకుకు టీఎస్ఎస్పీడీసీఎల్తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంత వరకు రీసైకిల్ చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామన్నారు.
మెట్రో రైల్ సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబోలి – ఎయిర్పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దాంతో సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు ఉండడంతో వారంతా ఎక్కువగా సొంత వాహనాలు వాడుతున్నారని అన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ-ఫలక్నుమా- ఏయిర్ పోర్టు రూట్, ఎల్బీనగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళ్తుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని అందుకే ఈ రూట్ చాలా వినియోగకరంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం అన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్తో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు.
మూసి నది పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్, గొల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి తదితర వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ను రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పీపీపీ మోడల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందన్నారు.