హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు రూ.750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని, వారి సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి విస్మరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.
వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వారి వేతన స్కేళ్లను బట్టి కనిష్ఠంగా రూ.20 వేలు, గరిష్ఠంగా రూ.35-40 వేలు, సగటున రూ.25 వేల చొప్పున మొత్తం రూ.750 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయినా ఈ బకాయిల ఊసెత్తడం లేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ పెద్దలను, అధికారులను సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని, ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్సీ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ చెల్లింపులపై ఆర్థిక, ట్రెజరీ శాఖల అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. దీంతో ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు చావా రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పీఆర్సీ బకాయిలతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కూడా భారీగా పేరుకుపోయాయి. వీటిలో ఇన్సూరెన్స్ బకాయిలు దాదాపు రూ.80 కోట్ల వరకు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు రూ.50 కోట్లకుపైగా ఉంటాయని స్వయంగా ఆర్థిక శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ బకాయిల చెల్లింపులను కూడా ప్రభుత్వం నిలిపివేసిందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులపై ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు జరిపి, అనుమతి మంజూరు చేసినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ఆ డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని వాపోతున్నారు. అయితే, నిధుల లభ్యతను బట్టి ఉద్యోగ, ఉపాధ్యాయులకు బిల్లులు క్రమంగా చెల్లిస్తున్నామని, అవి క్రమంగా క్లియర్ అవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు.