హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్పై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆటం బాంబు కంటే డ్రగ్స్ ప్రమాదకరమని స్పష్టం చేశారు. డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్స్ గురించి స్టడీ చేసి, నివారించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. నార్కోటిక్స్ కూడా చాలా భయంకరమైనది. సమాజం జీవికను ప్రశ్నించే మహమ్మారి. యువత బంగారు భవిష్యత్ను నాశనం చేస్తోంది. ఆటం బాంబు కంటే ప్రమాదకరమైనది. మానవ జీవితాన్ని ఛాలెంజ్ చేస్తున్న విషయం ఇది. కాబట్టి ఈ రెండింటి విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పదు. పోలీసింగ్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలవాలన్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ ఉంది. ఆయన ఏదో రూపంలో తెలంగాణకు సేవ చేస్తూనే ఉండాలి. ఒక వేళ డ్రస్సు మారినా ఆయన సేవ మాత్రం మారదు. ఏకే ఖాన్ మైనార్టీ వెల్ఫేర్ గురించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడ అద్భుత ఫలితాలు వస్తున్నాయి. వారి సేవలు కూడా కొనసాగాలని కోరాను. మీ అందరి సహకారం, ప్రస్తుత పోలీసుల పనితీరు, ప్రజల యొక్క సహకారం గత 8 సంవత్సరాలుగా శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకుపోతున్నాం. భవిష్యత్లో కూడా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హైదరాబాద్లో చాలా నేరాలు తగ్గాయన్నారు సీఎం కేసీఆర్.