బాన్సువాడ : ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు పనులు లేక, తినడానికి తిండి లేక తెలంగాణ రాష్ట్రానికి వలసలు వస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రం బరంగెడ్గి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) పై విమర్శలు చేస్తున్నప్పుడు వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏమి పనులు చేస్తున్నారో ప్రజలు గమనించాలని విన్నవించారు. దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే వారి నాయకులు పదవుల కోసం కొట్టుకోవడం తప్ప వారికి అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. పరిపాలన కుంటుపడుతుందని వ్యాఖ్యనించారు. తెలంగాణ ను కాపాడుకోవాలంటే ప్రాంతం అంటే అభిమానం, పరిపాలన పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్(CM KCR) వంటి నాయకుడు ప్రభుత్వాన్ని నడపాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూరు వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ. 500 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.మద్నూర్ నుంచి పోతంగల్ మీదుగా బోధన్ వరకు నూతనంగా జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 470 కోట్ల నిధులు మంజూరు చేశారని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పరిపాలనలో ఆదర్శంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో యువకునిలా పనిచేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు వచ్చే శాసనసభ ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్( BRS )పార్టీ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని స్పీకర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.