హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం రాత్రి పరిశీలించారు. సీఎస్, పోలీస్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి స భా ప్రాంగణం, వాహనాల పారిం గ్ ఏరియా, యాగశా ల తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సీటింగ్, పారింగ్ ఏర్పాట్లపై మంత్రి అధికారులతో చర్చించారు. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా లైటింగ్ సుందరీకరణ పనులపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు, పోలీసుశాఖ సమన్వయంతో సచివాలయ ప్రారంభోత్సవం విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు.