కరీంనగర్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దేశానికే దారి చూపారని మాజీ ఎంపీ ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ ప్రశంసించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని పరిశీలించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హుజూరాబాద్కు, అక్కడ నుంచి జమ్మికుంటకు చేరుకొన్నారు. హుజూరాబాద్, జమ్మికుంటలో దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు పథకం చాలా బాగుందని కితాబిచ్చారు. దళితుల ఆర్థిక, సామాజిక, సాధికారతను ఎంతో ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. పథకాన్ని అధికారులు కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నారని అభినందించారు. ఈ పథకం ద్వారా దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, తాను కండ్లారా చూశానని చెప్పారు. విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడే దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయని గ్రహించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళితబంధులాంటి మహోన్నత పథకం దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు కావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల కోసం కూడా ఇలాంటి పథకాలు తేవాలని తాను సీఎం కేసీఆర్తో చర్చిస్తానని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు.
దళితబంధు పథకం కింద లబ్ధిదారులు పొందుతున్న ప్రయోజనాలను కండ్లారా చూసిన ప్రకాశ్ అంబేద్కర్ అబ్బురపడ్డారు. జమ్మికుంటలోని భగవతి లేడీస్ ఎంపోరియంలో సునీత, గాయత్రి మ్యాచింగ్ సెంటర్లో వనజ, అనుగోల్డెన్ బేకరీలో బైరిమల్ల అనిల్ అనే లబ్ధిదారులను కలిసి ప్రత్యక్షంగా మాట్లాడారు. అనిల్ ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కట్ చేసిన ప్రకాశ్ అంబేద్కర్.. లబ్ధిదారులకు తినిపించారు. రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం కేసీఆర్ తమకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేశారని లబ్ధిదారులు వివరించారు. వివిధ వ్యాపారాలు చేసుకొని నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించుకుంటున్నామని చెప్పడంతో ఆనందపడ్డారు. జమ్మికుంట నుంచి తిరిగి హుజూరాబాద్ చేరుకొన్న ప్రకాశ్ అంబేద్కర్ ఆరుగురు లబ్ధిదారులు కలిసి ఏర్పాటు చేసుకొన్న కుశాల్ మాడ్రనైజ్డ్ ఫ్లెక్సీ ప్రింటర్ షాపును ప్రారంభించారు. ఈ షాపు ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఎక్కడి నుంచైనా ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసుకోవచ్చని, హైదరాబాద్ తర్వాత అలాంటి టెక్నాలజీతో హుజూరాబాద్లోనే నెలకొల్పామని లబ్ధిదారుల్లో ఒకరైన రాహుల్ చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్లోని జైకిసాన్ ఫర్టిలైజర్ షాపు యజమాని సరిత, రాజా డిజైనర్ షాపు యజమాని అభిలాష్, జ్యూట్ బ్యాగుల తయారీ యూనిట్ యజమాని వేల్పుల శారదతో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడారు. ఈ పథకం ద్వారా ఎంత వరకు సంపాదించుకుంటున్నారు? జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాలను వారితో చర్చించారు. ఇలాంటి పథకం దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలైతే దళితులు ఆర్థికంగా ఎప్పుడో బలపడేవారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పథకం ఒకటి అమలు చేయాలనే ఆలోచన వచ్చినందుకు కేసీఆర్ అభినందనీయుడని కొనియాడారు. తిరిగి హైదరాబాద్ వెళ్లే సమయంలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో వాహనాలను ప్రదర్శించారు. ఇవి దళితబంధు కింద అందించినవేనని ప్రకాశ్ అంబేద్కర్కు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఇన్ని వాహనాలు ఒక్క హుజూరాబాద్ లబ్ధిదారులకే ఇచ్చారా? అని కలెక్టర్ను అడిగారు. ఆయన వెంట మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్ పర్సన్లు గందె రాధిక, తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ ఇరుమల్ల రాణి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఆర్డీవో హరిసింగ్, ఎంపీడీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఉన్నారు.