కామారెడ్డి : డబుల్ ఇంజిన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం వెనుకబడిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో 30 పడకల సీహెచ్సీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి, వ్యవసాయ మార్కెట్ వాణిజ్య దుకాణముల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. డయాలసిస్ పేషంట్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
‘తెలంగాణ ఏర్పాటుకు ముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 83 కు పెంచుకున్నాం. ఇటీవలే 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేంద్రం ఇవ్వలేదని’ ఆయన వెల్లడించారు. కామారెడ్డిలో మెడికల్ కాలేజీని త్వరలో ప్రారంభిస్తామని, ఎంత మంది ఉంటే అంత మందికి కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్ ఇస్తామని వివరించారు.మాతృ మరణాలు తగ్గించడంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని తెలిపారు.
తెలంగాణలో 2016 పింఛను ఇస్తే, గుజరాత్ లో 750 ఇస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.మహారాష్ట్ర, కర్ణాటకలో కరెంట్ కోతలున్నాయని ఇచ్చే 8, 9 గంటలకు ముక్కు పిండి వసూలు చేస్తారని ఆరోపించారు.దేశంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులది మాటలు ఎక్కువ చేతలు తక్కువని విమర్శించారు. ‘ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా పేదలు, నిరుద్యోగుల ఉసురు తీశారని’ హరీశ్రావు మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తున్నారని వెల్లడించారు.మోటార్లకు మీటర్లు పెడితే రూ.6 వేలు ఇస్తామని కేంద్రం చెబుతున్నాకేసీఆర్ ససేమిరా అంటూ గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టను అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.