18 వేల కోట్లతో 2.70 లక్షల ఇండ్లు
కాంగ్రెస్ హయాంలో డబ్బా ఇండ్లు
నేడు గ్రామాల్లో సకల సౌకర్యాలు
మహబూబ్నగర్, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని, వీటి కోసం కూడా పేదలను అనేక తిప్పలు పెట్టేవారని గుర్తు చేశారు. పేదవాడి ఇల్లు అంటే ఆత్మగౌరవంతో ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో రూ.2.10 కోట్లతో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లను, రైతు వేదికను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. రూ.18 వేల కోట్లతో 2.70 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అర్హులకు కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని తెలిపారు. గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ప్రతి గ్రామంలో రోడ్లు, చెట్లు, పారిశుద్ధ్యం, రైతు వేదిక, డబుల్ బెడ్రూం ఇండ్లు, ట్రాక్టర్, ట్యాంకర్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్లు ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ నీటితో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్రమే పార్లమెంటులో తెలిపిందని గుర్తుచేశారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మహబూబ్నగర్ బహిరంగ సభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చిన నరేంద్రమోదీ, ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. సోషల్ మీడియాలో బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని, వారిని అదే స్థాయిలో ఎదుర్కోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుంటే దేశం ఇప్పటికే సూపర్ పవర్గా ఎదిగేదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.