ఏడాదిలోనే లబ్ధిదారులకు 4,500 ఇండ్ల అప్పగింత
90 శాతం పనులైన ఇండ్ల నిర్మాణం పూర్తికి కసరత్తు
203 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జోరందుకొన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,535 ఇండ్ల నిర్మాణం 100 శాతం పూర్తయింది. మరో 69,488 ఇండ్లు దాదాపు పూర్తికావొచ్చాయి. మిగిలిన చోట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తయిన 56,066 ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 4,500 ఇండ్లను లబ్ధిదారులకు అందజేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టంచేశారు.
90శాతం పూర్తయిన ఇండ్లకు 203 కోట్లు
ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదిక పూర్తిచేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది. ఈ నేపథ్యంలో 90 శాతం పూర్తయిన ఇండ్లలో ప్లంబింగ్, వైరింగ్, వాటర్వర్క్స్కు సంబంధించిన పనులు పూర్తిచేసేందుకు ఇటీవల రూ.203 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రానున్న రెండు నెలల్లో మరో 70 వేల ఇండ్ల నిర్మాణాన్ని 100 శాతం పూర్తిచేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ఇండ్లు పంపిణీ చేయడంతోపాటు మిగిలిన 91 వేల ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఇందుకోసం రానున్న వారం, పది రోజుల్లో సమీక్ష నిర్వహించి పూర్తి ప్రణాళికను సిద్ధం చేయనున్నట్టు వివరించారు.