హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలనుకోవడం వారి దివాళా కోరు రాజకీయ విధానాలకు నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha) ఆరోపించారు. కేసీఆర్(KCR) ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే విద్యార్థులను పావుగా ఉపయోగించుకోవడం ప్రతిపక్షాలకు తగదని సూచించారు. పదవ తరగతి(Tenth Exams) పరీక్షల విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసే విధంగా ప్రతిపక్షాలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ప్రతిపక్షపార్టీలు (Opposition parties) చేస్తున్న కుట్రలో బలికావద్దని విద్యార్థులు, తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. మొత్తం ఆరు పరీక్షలలో నేటితో ముగిసిన రెండు పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు వస్తున్నవార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
ఈ విషయంలో వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు కట్టు దిట్టమైన(Strict measures) చర్యలను చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్లతోపాటు పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారని ఆమె వెల్లడించారు.