Harish Rao | లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విచారం వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించిందని.. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు.
తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణమని హరీశ్రావు అన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామ సభల పేరిట నిప్పులు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భార్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు.
పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అని హరీశ్రావు విమర్శించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైందని అన్నారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముందని నిలదీశారు. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం, ఎక్కడిక్కడ నిలదీసిన దృశ్యాలు.. మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయని అన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తమని హరీశ్రావు మండిపడ్డారు. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదామని పిలుపునిచ్చారు. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని.. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చారు.