మెదక్ : తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల వద్ద కొండ పోచమ్మ సాగర్ కాలువ వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం నిజాంపేట మండలం నార్లాపూర్ హైదర్ చెరువుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ కేసీఆర్ సంపద పెంచిండు. పేదలకు పంచిండు. ప్రాజెక్టులు కట్టిండు. రైతులకు నీళ్లు ఇచ్చిండు’ అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఒకడు కూలగొడుతా అంటున్నాడు. మరొకడు పేల్చేస్తా అంటున్నాడు. ‘కూల్చేవాడు కావాలా. ప్రాజెక్టులు నిర్మించి రైతుల పంట పొలాల్లోకి నీళ్లు ఇచ్చే సీఎం కేసీఆర్ కావాలా ’ రైతులు ఆలోచించాలని కోరారు.
ఝుఠా మాటాల కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మవద్దని అన్నారు. సీఎం కేసీఆర్ రైతన్న బాగుండాలన్న ఉద్ధేశంతో 24 గంటల కరెంటు ఇస్తూ రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకోవాలని సూచించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే గోదావరి జలాలు వచ్చునా..!
గోదావరి జలాలు మెతుకు సీమకు వస్తాయని చరిత్రలో ఏరోజైనా కలలు కన్నామా అని అన్నారు. సీఎం కేసీఆర్ గోదావరి నీళ్లు తెస్తానంటే మేము బతికుండంగా చూస్తామా. నీళ్లు వస్తాయా. అని ఎద్దేవా చేసిన కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. మేడిగడ్డ దగ్గర ఉన్న గోదావరిని వందల కిలోమీటర్లు దూరం తీసుకొచ్చి 20 తాటిచెట్ల ఎత్తుకు ఎత్తి చేగుంట మండలంలో గోదావరి జలాలు పారించడమంటే ఎంతో గొప్ప విషయమన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో రోడ్లపైకి వచ్చి నీళ్లు తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రారంభించి ఇంటింటికీ నల్లాను ఏర్పాటు చేసి తాగునీటిని అందించారని, పొలం వాకిట్లోకి గోదావరి జలాలను తెచ్చారని గుర్తు చేశారు.
కొందరూ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లోబల్ ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కళ్ల ముందు కనబడుతున్న గోదావరి జలాలను చూడాలని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పేదలను కొట్టి కార్పొరేటర్లకు పెట్టే ప్రయత్నం చేస్తుందని మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. సంపదను పెంచి పేదలకు పంచే నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని చెరువులు కూడా నింపే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ఈ నీటితో ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీళ్లు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.