బాల్కొండ, నవంబర్ 13 : దళితబంధు పథకం పవిత్రమైనదని, ఇలాంటి ఆలోచన దేశంలో ఇంతవరకు ఎవరూ చేయలేదని, దశలవారీగా దళితబంధు లక్ష్యం పూర్తవుతుందని మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నాలుగేండ్లలో నియోజకవర్గంలో అందరికీ దళితబంధు అందించి తీరుతామని భరోసా కల్పించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ప్రచారం నిర్వహించారు. దళిత కుటుంబాలపై కేసీఆర్కు ఉన్న ప్రేమకు దళితబంధు నిదర్శనమని పేర్కొన్నారు. నాలుగు రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీ, 18 రాష్ర్టాల్లో ఉన్న బీజేపీ దళితబంధు లాంటి పథకాన్ని ఎందుకు తేలేదని ప్రశ్నించారు.
రుణమాఫీ సంపూర్ణంగా అమలవుతుందని, ప్రతిఒక్కరికి రుణమాఫీ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. దళితబంధు, రుణమాఫీపై విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లి చూసి వాస్తవాలు గ్రహిస్తే కారు గుర్తుకే ఓటు వేస్తారని అన్నారు. కేసీఆర్ది మానవీయ పాలన అన్నారు. కరోనా విపత్తు సమయంలోనూ ఆసరా పింఛన్లు ఆపకుండా పేదలకు ఆసరాగా నిలిచినట్టు గుర్తుచేశారు.
మంత్రి వేములకే మా ఓటు
జలాల్పూర్లో ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన వృద్ధుడు ఎర్రం గంగారాం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వద్దకు వచ్చి ‘మా ఓటు మీకే’ అని నినదించాడు. ‘ఇంత మంచి అభివృద్ధి ఎన్నడూ సుడలే. గతంలో మా జలాల్పూర్లో కట్టమీదికి పోవాలంటే సైకిల్ తోవ కూడా లేకుండే. అలాంటిది మన మంత్రి వేముల వచ్చాక రెండు ట్రాక్టర్లు పో యేంత రోడ్డు వేశారు. మా ఊళ్లో రోడ్లు మంచి గా అయినాయి. మీరే మళ్లీ గెలువాలి. మీకే మా ఓటు’ అని గంగారాం ప్రకటించాడు.