కరీంనగర్, మే 4(నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ప్రజలు, రైతులు ఈ దేశంలో లేరా? రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు గవర్నర్కు కనిపించడం లేదా? వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాయరు?’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ను ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిందిపోయి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వారితో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు కట్టే జీఎస్టీతో కేంద్రం ఎంజాయ్ చేయవచ్చుకానీ, ఇవాళ అదే ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే సహకరించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు దేశంలో భాగం కాదా? అని కేంద్రాన్ని, గవర్నర్ను తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఈ క్లిష్ట సమయంలో గవర్నర్ సైతం బాధ్యత తీసుకోవాలని, ఎఫ్సీఐ అధికారులను పిలిచి కేంద్రంపై ఒత్తిడి పెంచి రైతులను ఆదుకోవడంలో కలిసి రావాలని కోరారు. అవసరమైతే కల్లాల వద్దకు రావాలని, తాము సైతం పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న గవర్నర్.. రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ మొదలు గ్రామ స్థాయి ప్రతినిధుల వరకు ప్రతి ఒకరు రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, అదే బాధ్యతను గవర్నర్ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా తీసుకోవాలని సూచించారు. కల్లాల్లో తడిసిన ధాన్యంతో క్వింటాల్కు 67 కిలోల ఔటర్న్ (బియ్యం) రాదని, దీన్ని 50 కిలోలకు తగ్గించాలని ఎఫ్సీఐని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు సీఎం కేసీఆర్ ప్రకటించారని, కేంద్రం రూ.20 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తడిసిన ధాన్యం కొంటున్నారని, కేంద్రం నిబంధనలు సడలించాలని, తేమ శాతాన్ని 17 నుంచి 20 శాతానికి పెంచాలని కోరారు. రూ.43 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రంలో రైతులను ఆదుకునేందుకు డబ్బులు లేవా? లేదంటే తెలంగాణ రైతులపై కేంద్ర పెద్దలకు మనసు లేదా? అని మంత్రి ప్రశ్నించారు.