BJP | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): చట్టం తెలువదు.. చట్టాన్ని గౌరవించాలన్న సోయి ఉం డదు. అవగాహన లోపం, భావ దారిద్య్రం.. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు. ప్రతిదానికీ పిచ్చిపిచ్చి సూత్రీకరణలు.. ఇదీ రాష్ట్ర బీజేపీ దుస్థితి. పార్టీలో ఒకరో ఇద్దరో అడ్డగోలుగా మాట్లాడితే సాధారణమే అనుకోవచ్చు. కానీ.. పార్టీ అధ్యక్షుడు మొదలు, కీలక నేతలమని చెప్పుకొనేవారంతా తలతిక్క వ్యాఖ్యలు చేస్తే ఏమనాలి? ‘పిచ్చి తగ్గిందంటే.. తలకు రోకలి చుట్టమన్నట్టు’గా ఒక్కో నేత ఒక్కో రకమైన తిక్క వ్యాఖ్యలు చేస్తూ ప్రజల చేతుల్లో చివాట్లు తింటున్నారు. ఇప్పటికే ‘బీజేపీకి కార్యకర్తలను దూరం చేసేందుకే నోటిఫికేషన్లు వేస్తున్నారు’, ‘మసీదులు తవ్వుదాం’, ‘ఆరేడు నెలలు చదువులు పక్కకుపెట్టి బీజేపీ కోసం పనిచేయండి’ వంటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో బీజేపీ నేతలు అభాసుపాలయ్యారు. అయినా తెలివి తెచ్చుకోకుండా మళ్లీమళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను కొన్ని గమనిస్తే..
బండి సంజయ్: ఉత్తరప్రదేశ్ మాదిరిగా తెలంగాణలోనూ బుల్డోజర్ రాజ్యం తెస్తాం. తప్పు చేసినవాళ్ల ఇండ్లను కూలగొడతాం.
ఏదైనా ఘటనలో తప్పు ఎవరు చేశారనేది అప్పటికప్పుడు ఎలా నిర్ణయిస్తారు? న్యాయస్థానాలు నిర్ణయించే వరకు వాళ్లు నిందితులు మాత్రమే. అలాంటిది ముందే దోషిగా నిర్ణయించి, శిక్ష అమలు చేయడమంటే న్యాయస్థానాలను అవమానించడం కాదా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిందితుల ఇండ్లు కూలగొట్టుమని ఏ చట్టం చెప్తున్నది? ఏ కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది? ఆస్తులను కూల్చిన తర్వాత వాళ్లు నిర్దోషులని తేలితే ఎలా? అని నిలదీస్తున్నారు. బుల్డోజర్లపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు యూపీ చర్యలను తప్పుబడుతుంటే.. అలాంటి అరాచక పాలనను తెలంగాణలో అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎలా అంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బుల్డోజర్లు ఉన్న ఉత్తరప్రదేశ్ నేరాల్లో ఎందుకు అగ్రస్థానంలో ఉన్నదని నిలదీస్తున్నారు.
డీకే అరుణ: గ్యాస్ సిలిండర్ రూ.1200. ఒక్క సిలిండర్ రెండు నెలలు వస్తుంది. అంటే రోజుకు రూ.20 ఖర్చవుతుంది. ఇదేం పెద్ద విషయం కాదు.
గ్యాస్ సిలిండర్ ధరను అడ్డగోలుగా పెంచడమే కాకుండా తిరిగి సమర్థించుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రధానిగా మోదీ రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉండేదని.. ఆమె చెప్పిన లెక్క ప్రకారమే రోజుకు దాదాపు రూ.7 పడేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఖర్చు మూడు రెట్లు పెరిగిందని.. ఇది పేదలను బాగు చేయడమా? భారం పెంచడమా? అని నిలదీస్తున్నారు.
డీకే అరుణ: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ ఉంటే గ్యాస్ సిలిండర్ ధర తగ్గించవచ్చు కదా? గ్యాస్ సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.300 వసూలు చేస్తున్నది.
గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో ఉన్నది. ఎంతమేర పన్ను వేయాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. 5 శాతం స్లాబ్ అమలవుతున్నది. అంటే.. సిలిండర్పై కేంద్రం 5 శాతం పన్ను, రాష్ర్టాలు 5 శాతం పన్నులు వసూలు చేస్తాయి. చట్టం ప్రకారం జీఎస్టీ పరిధిలోని వస్తువులపై ఇతర పన్నులు వేసే అవకాశమే లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఎలా తగ్గించగలుగుతుంది? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జీఎస్టీ పరిధిలోని వస్తువులపై అదనంగా రూ.300 వసూలు చేసే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు ఈ మాత్రం అవగాహన కూడా లేదా అని ఎద్దేవా చేస్తున్నారు.
గీతా మూర్తి (బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు) : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్కి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ ప్రజల కోసం కాకుండా ‘కవిత కమిషన్’గా పనిచేస్తున్నది.
మండలిలో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీకి పిలిపించి విచారణ జరిపింది. మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదు? కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు? ఢిల్లీలో ఉన్నది మహిళా కమిషన్ కాదా? మోదీ కమిషనా? బీజేపీ కమిషనా? అంటూ రాష్ట్రంలోని మహిళలు మండిపడుతున్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మహిళలకు బండి సంజయ్తో క్షమాపణ చెప్పించాల్సింది పోయి ఇలా వెనుకేసుకు రావడం ఏమిటని మండిపడుతున్నారు. ఇలా బీజేపీ ముఖ్య నేతలు ఒకరిని మించి ఒకరు పిచ్చి మాటలు మాట్లాడుతూ పార్టీని మరింత చులకన చేస్తున్నారని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.