తెలంగాణచౌక్(సిరిసిల్ల), ఆగస్టు 20: ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి పలువురి వద్ద దాదాపు రూ. 1.20 కోట్ల మేర వసూళ్లు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా హీరా మండలం శుభలయకాలనీకి చెందిన సాలది రామ్గోపాల్ తూర్పు గోదావరి జిల్లాలో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేశాడు. డబ్బు సంపాదించాలనే దురాశతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొమురవెల్లి రాజ్కుమార్తో కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను మోసం చేసేవాడు. స్టాఫ్నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్స్ కావాలని ఏఆర్ఈఈఆర్ఎస్ఎన్హెచ్ఎం.జీవోవీ@జీమెయిల్. కామ్ ద్వారా నిరుద్యోగ యువతకు మెయిల్ చేసేవారు.
ఆయుష్మాన్భారత్లో పీఆర్వో పోస్టులు ఉన్నాయని వేములవాడలోని తిప్పాపూర్కు చెందిన అజ్మీర గణేశ్ భార్య సునీతకు మెయిల్ పం పారు. వివరాల కోసం 95155-59446 నంబర్ను సంప్రదించాలన్నారు. నిజమేననుకున్న సునీత ఆ నంబర్కు ఫోన్ చేసింది. ఉద్యోగానికి ఎంపిక కావాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుందని నమ్మబలికారు. సునీత రూ. 2.85 లక్షలు పంపించింది. ఉద్యోగం రాకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి ఏప్రిల్లో వేములవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి సదరు ఇద్దరు నిందితులను శనివారం వేములవాడలో అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.60 లక్షల నగదు, కారు, 3 మొబైల్ ఫోన్లు, 163 సిమ్కార్డులను స్వాధీనం చేసుకొన్నారు. సాలది రాంగోపాల్పై దేశవ్యాప్తంగా 65 కేసులు నమోదయ్యాయి.