రామగిరి, ఏప్రిల్ 27 : రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. వంద శాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నదని అన్నారు. ఆ దిశగా కోర్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ టెక్నాలజీని అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణలో 8,500 పెండింగ్ కేసులు పరిష్కారమైనట్టు వెల్లడించారు. జిల్లాల్లోనూ వంద శాతం కేసులు పరిష్కారం అవుతున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఐదు కోర్టుల భవన సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టీ వినోద్కుమార్, జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ బీ విజయసేన్రెడ్డి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజుతో కలిసి శనివారం సీజే ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు సీజే జస్టిస్ అరాధే మాట్లాడుతూ.. నల్లగొండలో నూతనంగా నిర్మించిన ఐదు కోర్టుల ఆధునిక భవనంలో డిజిటలైజేషన్తోపాటు అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. ముఖ్యంగా లైబ్రరీ, రిక్రియేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. జిల్లా కోర్టులో అత్యధిక కేసులు పరిష్కారం అవుతున్నాయని, ఆ దిశగా బార్ అండ్ బెంచ్ సహకారం ఉండాలని సూచించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయాధికారులు, న్యాయవాదులు ఎప్పటికప్పుడు సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఆ దిశగా సుప్రీంకోర్టు సైతం న్యాయమూర్తులు, న్యాయవాదుల సామర్థ్యాల పెంపుదల అవసరమని ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చట్టాలపై అవగాహన పెంచుకోవడంతోనే వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇకపై నల్లగొండ జిల్లా కోర్టులో కేసులన్నింటినీ డిజిటలైజేషన్ చేసే అవకాశం ఉన్నదని తెలిపారు.
రాష్ట్రంలో రెండో డిజిటల్ కోర్టు బిల్డింగ్ నల్లగొండ
ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సకల మౌలిక సదుపాయాలతో నల్లగొండలో నిర్మించిన ఐదు కోర్టుల భవన సముదాయం తెలంగాణలో రెండోదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్కుమార్ తెలిపారు. డిజిటల్ టెక్నాలజీతో ఉత్తమమైన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఇలాంటి వనరులు కల్పించడంతోనే న్యాయవ్యవస్థ మరిం త బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
కక్షిదారులకు సత్వర న్యాయం అందించి వంద శాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నదని చెప్పారు. నైపుణ్యాల పెంపునకు కోర్టు ఆవరణలో అందుబాటులోకి తెచ్చిన లైబ్రరీలను న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యాయవాదులు నిత్యం కొత్త విషయాలు తెలుసుకోవడానికి చట్టాల్లో వచ్చే మార్పులను గమనించి వాటిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.
న్యాయవాదులు చురుకుగా ఉంటే పేదలకు సత్వర న్యాయం అందడంతోపాటు ప్రజల్లో న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన నల్లగొండ కోర్టు సముదాయంతో పేద, అణగారిన వర్గాల వారికి సత్వర న్యాయం అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. జూనియర్ న్యాయవాదులు సీనియర్ల సలహాలు తీసుకోవాలని అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. నల్లగొండ కోర్టులో నూతన భవనాల నిర్మాణానికి 2008-09లో ప్రతిపాదనలు రూపొందించగా, 2011లో నిర్మాణాలకు శంకుస్థాపన చేశామని, ఇప్పుడు ప్రారంభోత్సవం జరగడంతో తన కల నెరవేరిందని అన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకట్రెడ్డి, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.