నిజామాబాద్/మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గిరిజన గూడేలకు పండగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం శుక్రవారం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇప్పుడు వారికి అటవీ అధికారుల భయం లేదు. పంటలు పాడుచేస్తారన్న భీతి లేదు. కేసుల గోల లేదు. దశాబ్దాల తరబడి భయంభయంగానే పోడుచేసుకుని జీవిస్తున్న వారి జీవితాల్లో ఇప్పుడు వెలుగులు విరబూశాయి. ఇక ఎవరికీ తలవంచక్కర్లేదు. నిర్భయంగా సాగుచేసుకుని అభివృద్ధి బాటలో ముందుకు సాగడమే ఇప్పుడు వారిముందున్న లక్ష్యం. పోడు భూముల పంపిణీతో గిరిజనుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ప్రసరింపజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గోండు వీరుడు కుమ్రంభీంకు అసలు సిసలైన వారసుడిగా నిలిచారు. జల్, జంగల్, జమీన్ అని నినదించిన ఆయన ఆశయాన్ని నెరవేర్చి గిరిజన గూడేల్లో సంతోషాలు నింపారు. జూన్ 30ని చారిత్రాత్మక రోజుగా మార్చారు.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 295 మండలాలు 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో భూములు పంపిణీ చేశారు. మొత్తం 4,06,369 ఎకరాల భూమికి 1,51,146 మంది పట్టాలు అందుకోనున్నారు. జిల్లాల పరంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 50,595 మంది పోడు రైతులు 1,51,195 ఎకరాల భూమికి పట్టాలు అందుకోగా, మానుకోట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అక్కడ 25,254 మంది రైతులకు 71,797 ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న గిరిజనుల్లో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇన్నేండ్ల సంధి పడుతున్న గోస ఈ రోజుతో తీరిపోయిందంటూ సంబురాలు చేసుకున్నారు. తాము బతికుండగా పట్టాలు అందుకుంటామని అనుకోలేదని, సీఎం సార్ తమకు దేవుడిలా మారి అందించిన భూములను కాపాడుకుంటూ సాగుచేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
నియోజకవర్గాల్లో బాన్సువాడ టాప్
పోడు భూముల పంపిణీల్లో రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గమైన బాన్సువాడది మరో ఎత్తు. అత్యంత ఎక్కువ మంది పోడుపట్టాలు అందుకున్న నియోజకవర్గంగా ఇది రికార్డులకెక్కింది. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం, దవాఖానల్లో రోగులకు అందిస్తున్న సేవలతో బాన్సువాడ ఇప్పటికే జాతీయస్థాయి గుర్తింపును అందుకుంది. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక పోడుపట్టాలు అందుకున్న నియోజకవర్గంగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నది. ఈ విషయంలో స్పీకర్ పోచారం పాత్ర ఎంతో ఉంది. జిల్లాల పరంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 50,595 మంది పోడు రైతులు 1,51,195 ఎకరాల భూమికి పట్టాలు అందుకోగా, మానుకోట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 25,254 మంది రైతులకు 71,797 ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు.
అర్హులకు అందాలనే తపన
నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏ పని తలపెట్టిన పక్కాగా, పకడ్బందీగా నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు అందించే విషయంలో అవినీతికి తావులేకుండా క్షేత్రస్థాయిలో నిఘాపెడతారు. బాన్సువాడ నియోజకవర్గంలో 30 శాతం గిరిజన గ్రామాలు, తండాలున్నాయి. ఇక్కడి గిరిజనుల్లో ఎక్కువమంది పోడు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. పోడు పట్టాలు వారికి చేతికి అందడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
3,809 ఎకరాల పంపిణీ
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలోనే పోడు భూములకు పట్టాలు జారీ అయ్యాయి. 3,809 ఎకరాల భూమికి సంబంధించి 2,090 మంది రైతులకు ప్రభుత్వం పట్టాలు అందించింది. పోడు పట్టాల పంపిణీ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ అందుకున్న పోడుభూములను కన్నబిడ్డలా చూసుకోవాలని రైతులకు సూచించారు.
గిరిజన బంధువు కేసీఆర్
గిరిజనులను సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసి సుపరిపాలన అందించారు. గిరిజన రైతన్నల మేలు కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. రిజర్వేషన్లను సైతం 6 నుంచి 10 శాతం పెంచారు. ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. అర్హులైన వారందరికీ పట్టాలు అందించి గిరిజన బంధువుగా కేసీఆర్ నిలిచారు. అలాంటి నాయకుడు రాష్ర్టానికి సారథిగా ఉండటం మనందరి అదృష్టం.
– పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభాపతి
30 ఏండ్ల సమస్య ఇది
మా నాన్న ముప్పై ఏండ్లుగా పోడు భూమి సాగు చేస్తుండు. చానామందికి చెప్పాము. ఒక్కరు కూడా పట్టించుకోలేదు. పెద్దనాయకులు అని చెప్పి చాలామంది వచ్చారు. ఎవరు మాకెళ్లి చూడలేదు. ఫారెస్టోల్లు వచ్చి గొడవ చేసేటోళ్లు. ఇప్పటికి మాకు ఊపిరి వచ్చినట్టుంది. ఇలాంటి పెద్ద ఉండాలి మాకు. సీఎం చానా గొప్పోడు. అందేకే మాకు పట్టా వచ్చింది.
– ఇర్పా శ్రీరాములు, బంజర ఉల్వనూరు, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం
సీఎం కేసీఆర్ మొనగాడు
అప్పుడు పాత పట్టాలు మా తాతలకు ఉన్నాయ్. పొలం ఎక్కడుందో తెలిసేది కాదు. ఎన్ని గొడవలు. రోజూ పొలం దగ్గర యుద్ధమే. ఎన్ని కొట్లాటలు. రోజూ అదే బాధలు ఎవరికి చెప్పినా తీరలేదు. నిజంగా కేసీఆర్ దేవుడే అందుకే మాకు పట్టాలు వచ్చాయి. ఇంక ఇయ్ రావనుకున్నాను. సీఎం మొనగాడు కాబట్టే పట్టాలు ఇచ్చిండు
– భాక్యా నాగరాజు, చల్లసముద్రం, ఇల్లెందు మండలం, భద్రాద్రి కొత్తగూడెం
మా కల నెరవేరింది
పోడు భూములకు పట్టా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వేళ మా కల నెరవేరింది. తాత, తండ్రుల ద్వారా సంక్రమించిన పోడు భూమిని దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటున్నా హక్కు పత్రాలు లేక చాలా ఇబ్బంది పడ్డాం. పోడు రైతుల ఇబ్బందులు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మాకు పోడు పట్టాలు ఇవ్వటం, రైతుబంధు, రైతు బీమా ఇస్తాననడం ఆనందంగా ఉంది.
– బానోత్ విజయ, రామచంద్రాపురం, బయ్యారం మండలం, మహబుబాబాద్
కేసీఆర్ సాబ్ మస్తు మంచి చేసిండు
ఎన్నో ఏండ్ల నుంచి అడవిలో ఉండి జీవనం సాగించుకుంటూ బతికిన మాకు తెలంగాణ గవర్నమెంట్ న్యాయం చేసింది.సీఎం కేసీఆర్ సాబ్ మాకు మస్తు మంచి చేసిండు. బాజాప్తా పట్టాలు ఇచ్చి ఆదుకున్నడు. మునుపు మస్తుసార్లు గొవలు అయినయి. సీఎం సారు పుణ్యాన మాకు భూమి పట్టా వచ్చింది. ఈ రోజు కేసీఆర్ సారు గిరిజనుల పాలిట దేవుడయిండు.
– హరిసింగ్, పోచారం తండా, బాన్సువాడ
మన ఇంటోళ్లే గుంట ఎక్కువియ్యరు
మన ఇంట్ల మ న వాళ్లే పొ త్తుల ఆస్తి పంచుకుంటే గుంట జాగ కూడా ఎక్కు వ ఇయ్యరు. కానీ సీఎం కేసీఆర్ సారు దయతో మా గరిబోళ్లకు రెండు ఎకరాలకు పట్టా ఇచ్చిండు. లక్షల రూపాయల ఇలువ చేసే భూమిని ప్రభుత్వం మా పేరిట పోడు భూములకు పట్టాలు ఇచ్చి న్యాయం చేసింది.
– చాంగ్బాహి, సంగెం తండా,నస్రుల్లాబాద్ మండలం
నాకు మూడెకరాల భూమికి పట్టా వచ్చింది
నా తాత తౌరియా నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నం. ఏండ్లు గడుస్తున్న కూడ నేను దున్నే మూడు ఎకరాల భూమికి పోడు పట్టా పాసు పుస్తకాలు రాలేదు. నేనుండగా అయినా ఇస్తారా.. ఇయ్యారా అనుకున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాల కోసం దరఖాస్తు చేసుకోమన్నారని చెప్పి దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పుడు నాకు మూడు ఎకరాల భూమికి హక్కు పత్రాలు వచ్చాయి. ఎంతో సంతోషంగా ఉంది.
– బానోత్ మంగీలాల్, కల్వల, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా