సంగారెడ్డి, జూలై 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్తో తెలంగాణ ప్రజలకు పేగుబంధం, ఫెవికాల్ బంధం ఉన్నదని, బీజేపీ, కాంగ్రెస్తో ప్రజలకున్నది ఫేక్, పేకమేడల బంధమని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికలు ఏవైనా ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పటాన్చెరులో ఫ్రీడమ్ పార్కు, డీసీసీబీ బ్యాంకు, ఆర్అండ్బీ అతిథి గృహం నూతన భవనాలను ప్రారంభించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.
జహీరాబాద్లో 1,127 మంది గిరిజనులకు 1,808 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను అందజేశారు. బూర్థిపాడ్లో ఆటోనగర్కు శంకుస్థాపన చేశారు. జహీరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వసంత్కు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా.. ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం తథ్యమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ప్రతిపక్ష స్థానం ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీల్లో గుబులు నెలకొన్నదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రిజెక్ట్ చేసిన నేతలను చేర్చుకొంటూ కాంగ్రెస్, బీజేపీలు జబ్బలు చరుచుకోవటం సిగ్గుచేటని అన్నారు.
ఉత్తర భారతంవైపే బీజేపీ చూపు
దక్షిణ భారతదేశంపై బీజేపీ చిన్నచూపు చూస్తున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. మోదీ సర్కారు ఉత్తర భారత్ వైపు తప్ప దక్షిణ భారతదేశంవైపు చూడటంలేదని మండిపడ్డారు. రూ.20 వేల కోట్ల రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అడిగితే రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీకి మోదీ కొబ్బరికాయ కొట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 60ఏండ్ల కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం వెనుకబాటుకు గురైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పోయింది కాబట్టే సమస్యలు పోయాయని చురకలంటించారు. సీఎం కేసీఆర్ను చూసి మహారాష్ట్రలో రాజకీయపార్టీలు వణుకుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదానికి అన్ని రాష్ర్టాల్లోని రైతులు, పార్టీలు ఆకర్షితులైతున్నట్టు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతున్నట్టు తెలిపారు. జిల్లాలో 1,127 మంది గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందజేసినట్టు చెప్పారు. పోడుభూముల పట్టాల పంపిణీతో గిరిజన కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నదని తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు ఐటీ పరిశ్రమలను విస్తరించనున్నట్టు చెప్పారు.
పది సీట్లు గెలిచి సీఎంకు బహుమానం
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లను గెలిచి సీఎం కేసీఆర్కు బహుమానంగా అందజేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విధానాలు నచ్చి తాను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాణిక్రావు, చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు మఠం భిక్షపతి, తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ భావి భారత ప్రధాని: శంకరన్న దోండ్గే
రైతుల కోసం నిరంతరం తపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశానికి ప్రధాని కావాలని నాందేడ్ మాజీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర రైతుసంఘం నాయకుడు శంకరన్న దోండ్గే ఆకాంక్షించారు. జహీరాబాద్లో ఢిల్లీ వసంత్ బీఆర్ఎస్ చేరిక సభలో ఆయన పాల్గొని, మాట్లాడుతూ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న పార్టీలకు ఎదురుగాలి మొదలైందని చెప్పారు. దేశ ప్రజలు, రైతులు సీఎం కేసీఆర్ను ప్రధాని స్థానంలో చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఉన్న రైతు సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులకు అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో గరీబీ విముక్తి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.