హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కన్నుల పండువగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్రావుతో పాటు చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ హట్టిగూడలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తిమ్మాయిగూడెంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తట్టి అన్నారంలో మంత్రి మహమూద్అలీ, మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో మంత్రి మల్లారెడ్డి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ చేశారు. గురువారం గ్రేటర్లో రెండో విడతలో 13,300 ఇండ్లు ఇచ్చారు. అంతకుముందు మొదటి విడతలో 11,700 ఇండ్లను అందించారు. మొత్తం గ్రేటర్వ్యాప్తంగా 25 వేల ఇండ్లను ప్రభుత్వం పేదలకు అందజేసింది.
నిరుపేదలకు సకల సౌకర్యాలతో డబు ల్ బెడ్రూం ఇండ్లు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. నిరుపేదలకు ప్రభుత్వం ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేయటం సిగ్గుచేటు. దేశంలో మరే రాష్ట్రంలోనూ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ లేదు. పేద, మధ్య తరగతి ప్రజలను గొప్పవారుగా చూడాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే విలువైన భూముల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు గ్రేటర్లో 25 వేల ఇండ్లు పంపిణీ చేశాం. విడతలవారీగా మొత్తం లక్ష ఇండ్లు పంపిణీ చేస్తాం.
– మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ధనవంతుల తరహాలో ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఎవరికి కేటాయించిన ఇండ్లలో వారే నివాసం ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. అభివృద్ధి పరంగా దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నది. గత పదేండ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి పక్షపాతం చూపకుండా, పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నాం.
– మంత్రి పట్నం మహేందర్రెడ్డి
జంట నగరాల్లో ఆగమ్యగోచరంగా ఉన్న నిరుపేదల బతుకులను చూసి చలించిన సీఎం కేసీఆర్ వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి పేదోళ్ల ఇంటి పెద్దగా నిలుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డబ్బా ఇండ్లు కాదు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న మాటను నిలుపుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని అర్హులైన వారు ఎవరూ బెంగపడొద్దు. స్థలం ఉంటే గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందజేస్తాం. అర్హులైన లబ్ధిదారులకు పైసా ఖర్చు, ఎవరి ప్రమేయం, పైరవీలు లేకుండా పారదర్శకతతో లబ్ధిదారులకు అందజేస్తున్నాం. దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయింపులు జరిపాం. తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైన పథకాలు దేశంలో ఎక్కడాలేవు. తెలంగాణ రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం.
– పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్
కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల కార్యక్రమం యజ్ఞంలా ముందుకు సాగుతున్నది. దరఖాస్తులు చేసుకున్న వారందరికీ దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం. పేదలపై ఒక్క రూపాయి భారం లేకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని చూసి దేశ ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ను బెస్ట్ సీఎం అని కొనియాడుతున్నారు.
– మంత్రి చామకూర మల్లారెడ్డి
విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్. ఏ ఒక్కరికీ రూపాయి లంచం ఇవ్వకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉచితంగా ఇండ్లను ఇస్తున్నరు. రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే, ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి తేని బీజేపీ నాయకులు డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావటం లేదు. గృహ నిర్మాణం కోసం గతంలో ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ రూ.5 లక్షలు ఇస్తామంటున్న మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దు.
– మంత్రి సబితాఇంద్రారెడ్డి
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీతో సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాకారమవుతున్నది. ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం.
– మంత్రి మహమూద్ అలీ
అర్హులైన అందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నది. ఇండ్లు రాని వారు నిరుత్సాహపడొద్దు. హైదరాబాద్లో ప్రభుత్వం లక్ష ఇండ్లను నిర్మించింది. అత్యంత పారదర్శకంగా అందరికీ అందజేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
– జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి