2BHK houses | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. తాజాగా మూడో దఫా 36 వేల ఇండ్లను రెండు దశలలో ప్రభుత్వం అందించనున్నది. తొలిదశలో సోమవారం 19,020 మందికి ఇండ్ల పట్టాలను అందించనుండగా, ఈ నెల 5న మరో 17,864 డిగ్నిటీ హోమ్స్ను లబ్ధిదారులకు అప్పగించనున్నది.
ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా, ర్యాండమైజేషన్ విధానంలో ఫ్లాట్లను కేటాయించనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కుత్బుల్లాపూర్, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో ఇండ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మంత్రులు హరీశ్రావు, తలసాని, మహమూద్ ఆలీ, పట్నం మహేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేదలకు ఇండ్ల పట్టాలను అందించనున్నారు. ఇక నగరంలో ఇప్పటివరకు తొలివిడతలో 11,700 మందికి, రెండో విడతలో 13,200 మందికి ఇండ్లను విజయవంతంగా పంపిణీ చేశారు.