హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి పార్టీ అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. శనివారం ప్రకటిం చిన టీపీసీసీ కమిటీల్లో ఎందులోనూ వెంకట్రెడ్డికి చోటు దక్కలేదు. దాదాపు నాయకులందరికీ ఏదో ఒక కమిటీలో చోటు కల్పించిన పార్టీ హైకమాండ్, కోమటిరెడ్డిని దూరం పెట్టింది.
మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్రెడ్డి(బీజేపీ)కి ఓటు వేయాలని వెంకట్రెడ్డి ప్రచారం చేసినట్టు ఆడియో వైరల్ కావడంతో అధిష్ఠానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికితోడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి, కోమటిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పలుమార్లు రేవంత్రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితులే ఆయన్ను పార్టీ దూరం పెట్టేందుకు కారణమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.