హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తొమ్మిది వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని నూతన కళాశాలల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో శనివారం ఎన్హెచ్ఎం, టీఎస్ఎంఎస్ఐడీసీపై మంత్రి హరీశ్రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 కాలేజీల భవనాలకు టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బృందాలు పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
దవాఖానల్లో అపరిమితంగా మందులు
అన్ని దవాఖానల్లో మందులు మూడు నెలల బఫర్ స్టాక్ ఉండేలా చూడాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఔషధాల సరఫరాలో ఎలాంటి నియంత్రణ వద్దని, కోరిన మేర పంపిణీ చేయాలని ఆదేశించారు. రీయేజెంట్స్ కొరత లేకుండా చూడాలని చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించిన 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ-ఉపకరణ్ పోర్టల్ను పూర్తిగా వినియోగించాలని, ఏవైనా వైద్య పరికరాలు చెడిపోతే వెంటనే అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. వైద్య పరికరాలు పనిచేసేలా చూసుకోవడం ఆయా దవాఖానల సూపరింటెండెంట్ బాధ్యతే అన్నారు. సమీక్షలో కుటుంబ ఆరోగ్యం సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావు ఆదేశాలు
వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను (ఎంసీహెచ్) త్వరగా పూర్తి చేయాలి. ముఖ్యంగా నిమ్స్, గాంధీ దవాఖానల్లో పనులను వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
టీవీవీపీ పరిధిలో కొనసాగుతున్న 23 సీహెచ్సీల పనులు త్వరగా పూర్తి చేయాలి.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 డయాగ్నొస్టిక్ సెంటర్లను త్వరగా అందుబాటులోకి తేవాలి.
మార్చురీల పనులు, 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనులు వేగంగా పూర్తి చేయాలి.
రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలకు సమీపంలో 9 క్రిటికల్ కేర్ హాస్పిటళ్లను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలి.