సంగారెడ్డి, జూలై 24 (నమస్తే తెలంగాణ): జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరమైన పదికిపైగా కొత్త కోర్సులను ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఐఐటీహెచ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఐటీహెచ్లో ఇంజినీరింగ్ సైన్సెస్లో బీటెక్ కోర్సును ప్రారంభించినట్టు తెలిపారు. ఐఐటీ వెలుపల ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఓపెన్ టు ఆల్ టీచింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
విదేశీ విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్లో చేరి పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు అకడమిక్, ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర నైపుణ్యావృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ జాయింట్ డైరెక్టర్ విద్యానాథ్ తెలిపారు. 1000 స్కిల్ హబ్లలో లక్ష మంది చేరారని చెప్పారు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోని విద్యార్థులకు ఉపయోగపడేలా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ పథకాన్ని, ఎన్ఈపీని అనుసరించి కొత్త కోర్సులను ప్రారంభించినట్టు హెచ్సీయూ ఉపకులపతి ప్రొఫెసర్ బీ జగదీశ్వర్రావు తెలిపారు. 19 ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్లలో చేరే విద్యార్థులకు మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. హెచ్సీయూలో ఒకేసారి రెండు అకడమిక్ కోర్సులు చదివేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ ద్వారా 14 డిప్లొమా కోర్సులను ప్రారంభించినట్టు తెలిపారు.