Telangana | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోతుండటం.. మరోవైపు పైసలు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. వానకాలంలో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిధులు ఇస్తే.. వాటితో రైతులు తిరిగి మళ్లీ పంటలు వేసుకొంటారు. అయితే, ఈసారి రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇంకా పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదు. గత వానకాలానికి సంబంధించి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించింది.
ఆ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత వారం- పది రోజుల్లోనే ప్రభుత్వం బిల్లులను మంజూరు చేయాల్సి ఉంటుంది. గత కేసీఆర్ సర్కారు ధాన్యం కొనుగోలు అంశంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేసేది. రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చామంటే వారం- పదిరోజుల్లో డబ్బులు వస్తాయన్న ధీమాతో ఉండేవారు. కానీ, ఈసారి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి నెల గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు ఇంకా పూర్తిస్థాయిలో డబ్బులు వేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి తొమ్మిదో తేదీ వరకు ధాన్యం పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పౌరసరఫరాల సంస్థ ద్వారా అందాల్సిన డబ్బులు అక్షరాల రూ.వెయ్యికోట్ల వరకు ఉన్నాయి. ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. రాష్ట్రంలో 6,718 ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టారు. వీటి ద్వారా 45 లక్షల 28 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటికి సంబంధించి నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. వాస్తవానికి చెప్పాలంటే నిరుడుతో పోలిస్తే ఈసారి సుమారు 18 లక్షల టన్నుల ధాన్యం తక్కువగా వచ్చింది. ధాన్యం తక్కువగా కొన్నప్పటికీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నప్పటికీ రైతులకు డబ్బులు విడుదల చేసే విషయంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు రాకపోయినా కనీసం రైతుబంధు అయినా వస్తుందని ఆశగా చూసిన రైతులకు అడియాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును విడుదల చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు వస్తే వేడినీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉండేదని, వ్యవసాయ పనులైతే మొదలుపెట్టుకునేవాళ్లమని రైతులు అంటున్నారు. పనులు మొదలుపెట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన సొమ్ము వస్తే ఆ సొమ్ముతో యాసంగి పంటను పండించుకునేవాళ్లమని చెప్తున్నారు. రైతుబంధు రాక.. ధాన్యం డబ్బులు అందక తప్పని పరిస్థితుల్లో మళ్లీ ప్రైవేటు అప్పుల కోసం తిరగాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో తమకు ఇప్పుడు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడంలేదని వాపోతున్నారు. పాత అప్పు తీరిస్తేనే కొత్తది ఇస్తామని చెప్తున్నారని, కొత్త అప్పు పుట్టకపోవడం, పాత అప్పు తీరకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యిందని అంటున్నారు. ప్రభుత్వం తమ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తుందో.. ఎప్పుడు రైతుబంధు నిధులను విడుదల చేస్తుందోనని వేయి కండ్లతో ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు.
కాంగ్రెస్ వస్తే రైతుబంధు డబ్బులు పెంచి ఇస్తమన్నరు.. పెంచిచ్చుడు ఏమోగని అసలు పైసలు కూడా రాలేదు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు అదునుకు పైసలిచ్చి పెట్టుబడి రంది లేకుండ చేసింది. నేను ఆరు ఎకరాల్ల్లో వరి, మక్క ఏసిన. యాసంగి పెట్టుబడి సాయం ఇంకా అందలే. అసలు ఇస్తరా? ఇయ్యరా? తెలుస్తలేదు. పెట్టుబడులకు ఇబ్బందైతాంది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బు ఇయ్యాలె.
-ఏడెల్లి రామసుధాకర్రెడ్డి, రైతు, ఎల్కతుర్తి (హనుమకొండ జిల్లా)
గతంలో సీజన్కు ముందే రైతుబంధు పడేది. కానీ, ఇప్పుడు ఎదురు చూసుడైతంది. రైతుబంధు ఎక్కువ ఇస్తమని చెప్పిన కాంగ్రెసోళ్లు ఇప్పటికీ ఇవ్వకుండా మాట తప్పుతున్నరు. కనీసం గత ప్రభుత్వం ఇచ్చినంత కూడా ఇస్తలేరు. యాసంగి నాట్లు పూర్తయితున్నయ్. కానీ, ఇంకా రైతుబంధు రాలేదు. రైతుబంధు వస్తే పెట్టుబడి భారం తప్పేది. కానీ, ఇప్పుడు అన్ని ఖర్చులూ మేమే భరించేసరికి ఇబ్బందయితంది. నాకు నాలుగు ఎకరాలకు రూ.20 వేలు ఖాతాలో జమయ్యేవి.
– సిరికొండ శ్రీధర్రావు, రామకృష్ణకాలనీ, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా